కార్పొరేషన్, డిసెంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ప్రజా పాలన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థలో జనవరి 4 వరకే పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజూ 10 డివిజన్ల చొప్పున ఆరు రోజుల్లో అన్ని డివిజన్లలో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ప్రతి డివిజన్కు ఓ ఉన్నతాధికారితో పాటు ఏడుగురు సిబ్బందితో కలిసి ఓ టీమ్ను సిద్ధం చేశారు. ఈ టీమ్తో పాటు విద్యుత్, సివిల్ సప్లయ్, రెవెన్యూ, విద్యా శాఖకు చెందిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వీరు తమకు కేటాయించిన డివిజన్లలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆయా డివిజన్లలో ఎంపిక చేసిన కేంద్రాల్లో టెంట్తో పాటు ప్రత్యేకంగా 6 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందించే దరఖాస్తు పత్రంతో పాటు ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తులను సైతం స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రతి కేంద్రం వద్ద వీల్ చైర్ అందుబాటులో ఉంచుతున్నారు. మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే దరఖాస్తుల్లో వచ్చే సందేహాలను తీర్చేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి డివిజన్లో ఏఏ ప్రాంతాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారన్న విషయంపై మహిళా సంఘాల ద్వారా ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురువారం ఒకటో డివిజన్లో తీగలగుట్టపల్లిలోని జెడ్పీహెచ్ఎస్లో, 6వ డివిజన్లోని జిల్లా వజ్రమ్మ ఫంక్షన్ హాల్లో, 12వ డివిజన్లో భగత్నగర్లోని శివాలయం వద్ద, 14వ డివిజన్లో రాజీవ్పార్కు సమీపంలో, 18వ డివిజన్లో పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 20వ డివిజన్లో పాత గ్రామ పంచాయతీ కార్యాలయం, 25వ డివిజన్లో ప్రజాభవన్ మైత్రి కన్వెన్షన్ వద్ద, 33వ డివిజన్లో పోలీస్ క్వార్టర్స్లోని ప్రభుత్వ స్కూల్లో, 42వ డివిజన్లో వావిలాలపల్లి మున్సిపల్ పార్కులో, 45వ డివిజన్లో కృష్ణ మందిర్ చౌరస్తాలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జమ్మికుంట, డిసెంబర్27: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 30 వార్డుల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 1, 2వ వార్డులు యూపీఎస్ ధర్మారం, 3వ వార్డు రామన్నపల్లి పాత జీపీ, 4వ వార్డు కొత్తపల్లి పాత జీపీ, 5వ వార్డు జమ్మికుంట బాలుర పాఠశాల, 6,7వ వార్డులు జమ్మికుంట బాలికల పాఠశాల, 8,9,10,11వ వార్డులు మోత్కులగూడెం పాఠశాల, 12వ వార్డు బాలికల పాఠశాల(ప్రైమరీ), 13,14వ వార్డులు ఆబాది పాఠశాల, 15వ వార్డు కేశవాపూర్ పాఠశాల, 16వ వార్డు చర్చి కాలనీ పాఠశాల, 17, 18, 20వ వార్డులు కొత్తపల్లి పాఠశాల, 19వ వార్డు కొత్తపల్లి పాత జీపీ, 21వ వార్డు బాలుర పాఠశాల, 22వ వార్డు ఉర్దూ మీడియం స్కూల్, 23వ వార్డు ఎమ్మార్సీ, 24వ వార్డు బాలికల పాఠశాల, 25,26వ వార్డులు డిగ్రీ కళాశాల, 27, 28, 29వ వార్డులు జూనియర్ కాలేజీ, 30వ వార్డుకు సంబంధించి బాలుర పాఠశాలలో దరఖాస్తులు తీసుకుంటారని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
మండలంలో 20 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారు. 28న అంకుశాపూర్, బిజిగిరిషరీఫ్, గండ్రపల్లి, జగ్గయ్యపల్లిలో, 29న కోరపల్లి, మాచనపల్లి, మడిపల్లి, నాగారంలలో, 30న నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లిలో, జనవరి 2న పెద్దంపల్లి, సైదాబాద్, శంభునిపల్లి, శాయంపేటలో, 3న తనుగుల, వావిలాల, వెంకటేశ్వర్లపల్లి, విలాసాగర్ గ్రామాల్లో అర్జీలు తీసుకుంటామని ఎంపీడీవో కల్పన వెల్లడించారు.
ఇల్లందకుంట, డిసెంబర్ 27: ఈనెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు గ్రామాల్లో జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శంకర్ సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 28న బోగంపాడు, బుజూనూర్, ఇల్లందకుంట, 29న చిన్నకోమటిపల్లి, గడ్డివాణిపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, 30న మల్లన్నపల్లి, మల్యాల, మర్రివాణిపల్లి, పాతర్లపల్లి, వచ్చే నెల 2న రాచపల్లి, సీతంపేట, సిరిసేడు, శ్రీరాంలపల్లి, 3న టేకుర్తి, వాగొడ్డురామన్నపల్లి, వంతడుపులలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వీణవంక, డిసెంబర్ 27: ప్రజాపాలన కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. పదిరోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆరు పథకాలు, ఇతర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి డీఈ పీఆర్ మహేశ్వర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున హాజరుకానున్నట్లు తెలిపారు. నేడు వీణవంక, చల్లూరు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.