గొల్లపల్లి, నవంబర్ 15: ‘అయ్యే ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిపోయిండు. చిరిగిన బట్టలతో వస్తుండు. కంటతడి పెట్టుకుంటున్నడని కాంగ్రెస్కు ఓటేస్తే మీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ బుగ్గిపాలు చేసుకున్నట్లే. బతుకులు ఆగం చేసుకున్నట్లే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమమని’ ధర్మపురి అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. శనివారం గొల్లపల్లి మండలం వెనుగుమట్ల, గోవింద్పల్లి, చిల్వాకోడూర్, భీమ్రాజ్పల్లి, దట్నూర్, చెందోలి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టగా, అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెనుగుమట్ల బస్టాండ్వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి గ్రామంలో పాదయాత్రగా ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ మనకంటే ముందు ఏండ్ల పాటు కాంగ్రెసోల్లే అధికారంలో ఉన్నారు కదా..? మరి అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి దాదాపు 11సార్లు అవకాశం ఇచ్చామని, కానీ చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం అంటూ రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీకే వారంటీ లేదని, ఇంకా వాళ్లు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉంటదా..? ఒకసారి ఆలోచించాలని సూచించారు. వారు అధికారంలో ఉన్న నాలుగు రాష్ర్టాలో ఏ ఒక్క రాష్ట్రంలో నైనా ఇక్కడ ప్రకటించిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారా..? చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ బంగారు భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకున్నట్లేనని, మీరు ఇప్పుడు వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్ అని చెప్పారు. మీరు కాంగ్రెస్ పాలను చూశారని, బీఆర్ఎస్ పాలన చూశారని, అందులో ఏది బాగుందో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదో..? ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందాయో చూడాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళ సౌబాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేలు, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం,
రైతు బంధు రూ.16వేలకు పెంపు, పింఛన్లు రూ.5 వేలకు పెంచడంతో పాటు, ప్రతి కుంటుబానికి రూ. 5 లక్షల బీమా, రూ 400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలందర్, సర్పంచ్ లక్ష్మీరాజేశం, శంకరవ్వ, పద్మావతి రవీందర్, రవీందర్, పావని నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, పాక్స్ అధ్యక్షులు రాజసమన్ రావు, మాధవరావు, అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, ఎంపీటీసీ అశోక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రమేశ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అశోక్, నాయకులు మల్లా రెడ్డి ఉన్నారు.