రాయికల్ : రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) ఆరోపించారు. వానకాలం పంట సీజన్ ( Kharif Crop Season) మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్నా గాని ప్రభుత్వానికి ముందస్తు కార్యచరణ ప్రణాళికను ఇంకా తయారు చేసుకోలేదని వెల్లడించారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలకు సంబంధించి కార్యచరణను ఇంకా రూపొందించ లేదని ఆరోపించారు. కనీసం ఖరీఫ్ పంటకైనా రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల కాలంలో ఆరు పంటలు పండాయని, ఇందులో ఎన్ని పంటలకు రైతు భరోసా కల్పించారో ఆయన ఆత్మకే తెలుసని విమర్శించారు.
ధాన్యం సేకరణపై కాంగ్రెస్ , బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతు గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. పప్పు దినుసులు, నూనె గింజలు పండించాలని సలహా ఇస్తున్న ప్రభుత్వం వాటికి ఏ విధమైన ప్రోత్సాహం కల్పిస్తుందో చెప్పడం లేదని పేర్కొన్నారు. కోతుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు కోతుల పునరుత్పత్తి నిలుపుదల కేంద్రాన్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని, తక్షణమే రైతుకు సోలార్ ఫెన్సింగ్ 50 శాతం రాయితీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో యూరియా అందుబాటులో లేదని, యూరియా యాప్ను తొలగించి నేరుగా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.