Procurement Scam | కోల్ సిటీ, మే 15 : ప్రతీ లారీ లోడుకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరి ధాన్యం తూకంలో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న ఘటన శుక్రవారం రామగుండంలో బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు, రైస్ మిల్లు వద్ద తూకం వేసిన ధాన్యానికి వ్యత్యాసం వస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామ యువ రైతు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రతీ లారీ లోడుకు నాలుగు క్వింటాళ్ల వరకు మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కొనుగోళ్లలో గోల్మాల్ వ్యవహారం బయటపడటంతో గ్రామ రైతులు నివ్వెరపోయారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధి జనగామ గ్రామ శివారులోని ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యాన్ని గోదావరిఖని గౌతమినగర్ లో గల రైస్ మిల్లుకు రవాణా చేసిన అనంతరం తూకం వేసిన ధాన్యం తక్కువ రావడంతో ఎక్కడో మోసం జరుగుతోంది.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన జువ్వాడి విజయ్ రావు అనే యువ రైతుకు సంబంధించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో తూకం వేసి 539 బస్తాలను అన్లోడ్ చేసి రైస్ మిల్లుకు పంపించగా అక్కడ 2 క్వింటాళ్లు షార్టెజ్ వచ్చిందని సాకుగా 5 బస్తాలు కట్ చేస్తున్నామంటూ ట్రక్ షీట్ రాసి ఇచ్చారు. ఐతే లోడు పంపించే ముందే బయట తూకం వేయించిన రిసీప్ట్ ఆధారంతో సదరు రైతు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అప్పటకే మిగతా రైతులు రవీందర్, నడిపెల్లి గోపాల్రావు, నీలం సంజీవ్ తదితర రైతులు ఐకేపీ సెంటర్ నుంచి అన్లోడ్ చేసి పంపించగా ఒక్కో లోడుకు 2 నుంచి 4 క్వింటాళ్ల వరకు ధాన్యం తక్కువ వచ్చినట్లు తూకం వేశారని తెలిపారు.
అమాయక రైతులను గుట్టుగా మోసం చేస్తున్న వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ అధికారులు రంగంలోకి దిగారు. జనగామ ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంను పరిశీలించారు. ఆ తర్వాత రైస్ మిల్లు వద్ద కాంటాను పరిశీలించారు. కాగా అందులో తక్కువ చూపించేలా సెట్టింగ్ చేశారని గుర్తించారు. దీంతో వే బ్రిడ్జి, కాంటా మిషన్లను సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం పై అధికారులకు నివేదించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, జనగామ గ్రామ రైతులు ఇన్ని రోజులు నష్టపోయిన ధాన్యం సంగతి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.