తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాలు ఉట్టి పడేలా ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయగా, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పలు ఆలయాల అర్చకులకు దూప దీప నైవేద్యం కింద నియామక పత్రాలను అందజేశారు. కాగా, వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పాల్గొనగా, వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పూజలు చేశారు.
రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. ప్రతి గ్రామం, పట్టణాల్లోని దేవాలయాలను ఉదయం మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదపండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మసీదులు, చర్చిలను ముస్తాబు చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి రాష్ర్టానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ ఓపెన్స్లాబ్పై ధూప దీప నైవేద్య పథకం కింద 18 మంది అర్చకులకు నియామకపు ఉత్తర్వు పత్రాలు అందజేశారు.
రాజన్న ఆలయ ప్రధానార్చకులు ఉమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కళాభవన్లో రుద్రహోమం, చండీహోమాలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాలు శ్రోతలను ఆనందపరిచాయి. సింహాచల శాస్త్రి భాగవతార్ చెప్పిన హరికథ ఆకట్టుకున్నది. రాత్రి 7 గంటలకు డాక్టర్ ముదిగొండ అమర్నాథశర్మ, ముత్యంపేట గౌరీనాథశర్మ సంస్కృతాంధ్రాష్టావధానమ్ శ్రోతలను రంజింపజేసింది. ఎన్ పరమేశ్వర్ బృందం కూచిపూడి నృత్యం అలరించింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, పోచమ్మ ఆలయాలలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి ప్రత్యేక పూజలు చేశారు. మసీదులో అధ్యక్షుడు ఎండీ సలీం ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ దేవాలయంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణలు పూజలు జరిపించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో శ్రీసీతారామస్వామి ఆలయంలో ప్రజాప్రతినిధులు పూజలు చేశారు.