రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలకు తాకిడి పెరుగుతున్నది. ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్న లక్ష్యం నెరవేరుతున్నది. గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు మహిళలకు వరంగా మారాయి. ఫలితంగా ప్రభుత్వ వైద్యశాలల్లో క్రమంగా ప్రసవాలు పెరుగుతున్నాయి.
కోరుట్ల, నవంబర్ 3 : రాష్ట్ర సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగా ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. కోట్లాది నిధులతో ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచేలా ఆధునిక సౌకర్యాలు కల్పించింది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు తెచ్చింది. మెరుగైన వైద్యంతో గర్భిణులకు భరోసా కల్పించింది. కేసీఆర్ కిట్లో 16 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నది. అబ్బాయి పుడితే 12 వేలు, అమ్మాయి పుడితే 13 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నది. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. ఇప్పుడు అమ్మ ఒడి వాహనం సమకూర్చడంతో పైసా ఖర్చు లేకుండా దవాఖానలకు సులభంగా, అక్కడి నుంచి సురక్షితంగా ఇళ్లకు వెళ్లగలుగుతున్నారు.
పెరిగిన ప్రసవాలు
వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సమష్టి కృషితో కోరుట్లలోని దవాఖానలో ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ యేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 427 ప్రసవాలు చేశారు. అందులో 213 సాధారణ ప్రసవాలు, 214 శస్త్ర చికిత్సలు ఉన్నాయి. కేసీఆర్ కిట్ పథకం కింద 335 మంది ఆర్థిక ప్రయోజనం పొందారు. సుమారు 30 వేల మంది రోగులు ఆరోగ్య సేవలు అందుకున్నారు. 3,139 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, టీ హబ్ ద్వారా 1,744 మందికి ఖరీదైన రక్త నమూనా పరీక్షలు చేశారు. ఈ దవాఖానలో 18 రకాల రక్త నమూనా పరీక్షలు చేస్తుండగా, మరో 120 ఖరీదైన పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని టీహబ్ సెంటర్కు రోగుల రక్తనమూనాలను పంపిస్తున్నారు. పైసా ఖర్చులేకుండా వేలాది రూపాయలు విలువ చేసే రక్త పరీక్షలను చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
వసతులు మంచిగున్నయ్..
సర్కారు దవాఖానలో వసతులు మంచిగున్నయ్. డాక్టర్లు ప్రతి రోజూ వచ్చి మా పరిస్థితిని చూసుకుంటున్నరు. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిన్రు. వేళకు మందులు ఇస్తున్రు. ప్రభుత్వ దవాఖాన అంటే మొదట భయపడ్డం. కానీ, ఇక్కడికి వచ్చినంక భయం పోయింది. డాక్టర్లు నాకు నార్మల్ డెలివరీ చేసిన్రు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా పాపకు జన్మనిచ్చిన.
– చెన్నవేణి ప్రవళ్లిక, బాలింత, సిరికొండ
(కథలాపూర్ మండలం)
దవాఖాన ల్యాబ్లో రక్త నమూనాలను పరీక్షిస్తున్న సిబ్బంది
బాగా చూసుకుంటున్నరు
ప్రైవేట్ దవాఖాన లెక్క సార్లు బాగా చూసుకుంటున్నరు. డాక్టర్లు మా ఇబ్బందులను ప్రతి రోజూ వచ్చి తెలుసుకుంటున్నరు. టైమ్కు మందులు వేసుకోవాలని జాగ్రత్తలు చెబుతున్నరు. నాకు వైద్యులు నార్మల్ డెలివరీ చేసిన్రు.
– తబుస్సుం సుల్తానా, బాలింత
(కోరుట్ల)
మెరుగైన సేవలందించేందుకు కృషి
ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ఆందిస్తున్న తోడ్పాటుతో రోగులకు సరిపడా మందులు అందుతున్నాయి. ఔషధాలు, ప్రసవాలకు సంబంధించిన సౌకర్యాలకు ఎలాంటి కొరత లేదు. కేసీఆర్ కిట్, ఆమ్మ ఒడి పథకాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్య సిబ్బంది సమష్టి సహకారంతో ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తాం. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ లక్ష్యాన్ని సాధిస్తాం. అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీదైన రక్త పరీక్షలు ఇక్కడే ఉచితంగా చేస్తున్నాం.
– డాక్టర్ వేముల సునీతరాణి, దవాఖాన సూపరిండెంట్ (కోరుట్ల)
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం
ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మొదటి కాన్పునకు సంబంధించి సాధారణ ప్రసవం జరిగేలా శాయశక్తులా కృషి చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ దవాఖానలకు ప్రసవానికి వచ్చే మహిళల శాతం పెరుగుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేయాల్సి వస్తున్నది. బాలింతలకు ప్రభుత్వం మంజూరు చేసిన కేసీఆర్ కిట్తో పాటు ఆర్థికసాయం అందిస్తున్నాం.
– డాక్టర్ మిట్టపల్లి శ్రీలక్ష్మి,
గైనకాలజిస్ట్ (కోరుట్ల)