విద్యానగర్, ఫిబ్రవరి 18: పోస్టల్ ప్రమాద బీమా పాలసీదారుల కుటుంబాలకు భరోసానిస్తున్నది. మరణించిన, గాయపడ్డ వారి ఖాతాల్లో వెనువెంటనే నగదు జమవుతున్నది. ఏడాది వ్యవధిలో కరీంనగర్ డివిజన్ పరిధిలో 21 మంది పాలసీదారులు మరణించగా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందింది. అలాగే వివిధ ప్రమాదాల్లో గాయాలపాలైన 40 మందికి పాలసీ ప్రకారం రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు అందించారు.
కాగా, పోస్టల్ బీమా పథకాల్లో చేరేందుకు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ శివాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది 50వేల మంది, ఈ సంవత్సరం ఇప్పటివరకు డివిజన్లో మొత్తం 25వేల మంది ప్రమాద బీమా చేసుకున్నారని వివరించారు. ఐదు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మూడు రకాల పాలసీలు (రూ.5, 10,15 లక్షలు) రూ. 320 నుంచి మొదలుకొని రూ. 775 వరకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రమాద బీమా తీసుకోవాలనుకునే వారు రూ. 200 తో ఐపీపీబీ ఖాతా తెరువాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దగ్గరలోని పోస్టాఫీసుల్లో సంప్రదించి వీలైన పాలసీని ఎంచుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.