మా తల్లిదండ్రులు హోటల్ నడుపుతారు. వారికి అప్పుడప్పుడు సాయం చేస్తుంటా. పాఠశాలలో ఉన్నప్పుడే నాకు వాలీబాల్పై కొంత పట్టుంది. అప్పటి నుంచే నాకు ఆటలు ఆడటమంటే ఇష్టం. నేను డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నా. మా పీఈటీ అనిల్ సార్ నాకు త్రోబాల్ శిక్షణ ఇచ్చారు. నాకు కెప్టెన్గా అవకాశం వచ్చింది. ఆటలో నిరూపించుకునే అవకాశం ఇచ్చిన మా సార్లను ఎప్పటికీ మర్చిపోను. జాతీయస్థాయిలో గెలుపు కోసం ప్రయత్నిస్తాం.
– ముద్రకోల అఖిల, త్రోబాల్ టీం కెప్టెన్ (గొల్లపల్లి)
వారంతా నిరుపేద యువతులు. చదువు పూర్తి చేసుకుని కొందరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, మరికొందరు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. అవకాశం వస్తే తామేంటో నిరూపించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గత జూలై నెలలో ఇషా గ్రామోత్సవ్ మహిళా త్రో బాల్ పోటీల్లో పాల్గొనే అవకాశం వారికి వచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి సహకారంతో శిక్షణ తీసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 20
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన పలువురు యువతులు, బాలికలు పలు క్రీడాపోటీల్లో రాణించేవారు. ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బైరగోని అనిల్ ఏ అవకాశం వచ్చినా సమాచారం ఇస్తుండేవాడు. గత జూలై చివరి వారంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇషా గ్రామోత్సవ్ మహిళా త్రోబాల్ పోటీలు ఉంటాయని తెలియడంతో వారికి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఎనిమిది మందితో జట్టును తయారు చేసి యూట్యూబ్లో త్రోబాల్ క్రీడా నియమాలు, ఆడే విధానంపై అవగాహన కల్పించారు.
అందరూ మధ్య తరగతి వారే..
ముద్రకోల తిరుపతి-సుజాత దంపతుల కూతురు అఖిల త్రోబాల్ టీం కెప్టెన్. ఆమె తల్లిదండ్రులు గొల్లపల్లిలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అఖిల చదువు పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. పెద్దూరి మల్లయ్య-లక్ష్మి దంపతుల కూతురు రమ్య, పెద్దూరి భిక్షపతి-రేణుక దంపతుల కూతురు స్రహన బీపీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఖాళీ సమయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నది. పెండ్యాల లక్ష్మీనర్సయ్య-నర్సవ్వ దంపతుల కూతురు మనీషా ఇంటి వద్దే బీడీలు చుడుతున్నది. బోయిని శంకర్-అంజమ్మ దంపతుల కూతురు భార్గవి డిగ్రీ పూర్తి చేసి, ఇంటి వద్దే బట్టలు కుడుతున్నది. దాసరి రమేశ్-లత దంపతుల కూతురు దివ్య, గోగూరి శ్రీనివాస్రెడ్డి-అంజలి దంపతుల కూతురు రిచిత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
జిల్లా నుంచి జాతీయ స్థాయికి..
గత ఆగస్టు నెలలో జిల్లాలో త్రోబాల్ పోటీలు నిర్వహించగా, 16టీంలు పాల్గొన్నాయి. ఇందులో గొల్లపల్లి జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ క్రమంలో ఈ నెల 10న ఢిల్లీ పబ్లిక్స్కూల్ నాచారంలో రాష్ట్రస్థాయిలో పోటీల్లోనూ సత్తాచాటి ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ నెల 23, 24 తేదీల్లో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో సత్తా చాటేందుకు యువతులు రెట్టింపు ఉత్సాహంతో సమాయత్తం అవుతున్నారు.
సంతోషంగా ఉన్నది
పూర్వ, ప్రస్తుత విద్యార్థులు త్రోబాల్ ఆడేందుకు ఒప్పుకోవడంతో నాకు విశ్వాసం కలిగింది. నాతోపాటు మా విద్యార్థులకు అందరికీ త్రోబాల్ క్రీడ కొత్తదే. అయినా విశ్వాసం సడలకుండా రెండు నెలల పాటు ఆటతీరు, నియమాలు తెలుసుకుంటూ విద్యార్థులకు శిక్షణ అందించాం. మా కృషికి తగిన విధంగా జాతీయస్థాయికి ఎంపికవ్వడం సంతోషంగా ఉంది.
– బైరగోని అనిల్, త్రోబాల్ కోచ్ (పీఈటీ), గొల్లపల్లి