రాంనగర్, అక్టోబర్ 20 : నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కదిలే పోలీసన్న రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. సమాజహితం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టే ఆయన సేవలు వెలకట్టలేనివి. సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా అందరినీ కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న క్రమంలో ఎందరో రక్షకభటులు ప్రాణాలర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఉదంతాలకు లెక్కేలేదు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడి విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు శుక్రవారం జిల్లాలో పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
1959లో దేశ సరిహద్దులో పహారా కాస్తున్న మన పోలీసు బృందంపై చైనా దాడికి దిగింది. లడఖ్ సమీపంలోని ‘హాట్స్ప్రింగ్’గా గుర్తింపు పొందిన అక్సాయ్చిన్ సమీపంలో 1959 అక్టోబర్ 21న ఈ దుర్ఘటన జరిగింది. సరిహద్దు జవాన్లు చైనా బలగాలపై ఎదురుదాడికి దిగి ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి వారిని స్మరిస్తూ 1960 అక్టోబర్ 21నుంచి ఏటా దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1980 దశకంలో ఉత్తర తెలంగాణలో నక్సల్బరి ఉద్యమం ఊపందుకున్నది. కమ్యూనిస్టు భావజాలంతో సాయుధ పోరాట పంథాలో, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా నక్సలైట్లు పోరుబాట పట్టారు. ఫలితంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రక్తపుటేర్లు పారాయి. 1985 నుంచి నక్సల్స్ ఏరివేతకు ప్రభుత్వం పోలీసులను వినియోగించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎందరో ఖాకీలు మావోయిస్టుల తూటాలకు నేలకొరిగారు. ఎన్కౌంటర్లు, మందుపాతర ఘటనలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. 1991 డిసెంబర్ 19న హుస్నాబాద్ మండలం రామవరం వద్ద నక్సల్స్ మొదటి సారిగా ల్యాండ్మైన్ను పేల్చడంతో పలువురు పోలీసులు అమరులయ్యారు. దీంతో అప్పటివరకు మొక్కుబడిగా సాగిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లాలోనూ ప్రతి అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఎందరో అమరులు..
నక్సల్స్ ఏరివేతలో భాగంగా 1985 నుంచి 2003 వరకు వివిధ ఎన్కౌంటర్లు, మందుపాతర పేలుడు ఘటనల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 48 మంది పోలీసులు నేలకొరిగారు. వీరిలో 43మంది పోలీసులు, ఐదుగురు హోంగార్డులున్నారు.
స్ఫూర్తిదాత జాన్ విల్సన్
ఒకప్పుడు నక్సల్స్కు పెట్టనికోటలా ఉన్న హుస్నాబాద్కు ఆయన ఎస్ఐగా వచ్చారు. నక్సల్స్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రయత్నించి, ప్రజల మన్ననలు పొందారు. చివరకు ఆ నక్సల్స్ పేల్చిన మందు పాతర ఘటనలోనే నేలకొరిగారు. ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఇక్కడి ప్రజలు నేటికీ మరచిపోలేదు.
రక్తదాతలే ప్రాణ దాతలు
జగిత్యాల ఎస్పీ సింధూశర్మ
దేశ భద్రత కోసం.. రేపటి తరాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరుల త్యాగం వెలకట్టలేనిదని జగిత్యాల ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించినపుడే వారి త్యాగానికి మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసుశాఖ, రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రకాశ్, పోలీసు అధికారులు, సిబ్బంది, యువతీయువకులు మొత్తం 150 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐలు కృష్ణకుమార్, రమణమూర్తి, కోటేశ్వర్, కిశోర్, ఆర్ఐలు వామనమూర్తి, నవీన్, ఎస్ఐలు, రెడ్క్రాస్ సొసైటీ బాధ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కట్టలింగంపేటలో నివాళి
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగపేట శివారులో ఏర్పాటు చేసిన పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం అమరవీరులకు ఎస్పీ రాహుల్హెగ్డే, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, ఇతర పోలీసు అధికారులు నివాళులర్పించనున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు స్మారక స్థూపం 2014లో అప్పటి డీఎస్పీ దామెరనర్సయ్య చొరవతో ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
స్మరించుకోవాలి
పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి. వారి త్యాగాలు వెలకట్టలేనివి. ఆ త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాం. ఈ సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్నాం. వినూత్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాం. రక్తదానంతోపాటు ఠాణాల్లో ఓపెన్ హౌస్, వ్యాస రచన పోటీలు, శాంతిర్యాలీలు నిర్వహించాం. అమరుల త్యాగాలు చిరస్మరణీయం. శాంతి భద్రతల పరిరక్షణే మా కర్తవ్యం.
– రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల
అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. సంస్మరణ దినోత్సవం రోజున మృతి చెందిన పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పోలీసులు ఉద్యోగానికి రాబోతున్న వారికి నూతనోత్తేజాన్ని, స్ఫూర్తి నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రధాన ఉద్ధేశం.
– ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, సీపీ, రామగుండం