MLA Putta Madhukar | మంథని, సెప్టెంబర్ 11: సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథనిలోని రాజగృహలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు.
సోషల్మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తోందని, ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేశారన్నారు. నేపాల్లో కూడ యువత మా ఆకలి తీర్చడానికి ఆలోచన చేయడం లేదని.. మా ఆశీస్సులతో విలాసవంతంగా గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కుంటుందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. అలాంటి పరిస్థితి మంథనిలో పునరావృతకాకుండా పోలీసులు, ప్రభుత్వం, ముఖ్యంగా మంథని ఎమ్మెల్యే కళ్లు తెరువాలన్నారు.
మంథని నియోజకవర్గంలో పోలీసులు మారక పోతే మంథని నుంచే ప్రళయం మొదలు అవుతుందని హెచ్చరించారు. మంథని నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, దుద్దిళ్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజ స్వరూపాలను చూపించడం పరిపాటిగా మారిందన్నారు. దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేక మార్లు అప్రమత్తం చేశామని ఆయన గుర్తు చేశారు. పోలీసుల్లో ఎస్సీలు, బీసీలు ఉన్నారని వాళ్లను వాడుకుని కరివేపాకులా పడేయడం దుద్దిళ్ల కుటుంబానికి అలవాటేనని, వాళ్లకు ప్రేమ, ఆప్యాయతలు ఉండవని ఎదుటివారిపై మిమ్మల్ని ఉపయోగించుకునేందుకు వినియోగించుకుంటున్నారన్నారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21నెలలు గడుస్తున్నా 420హమీలకు మానీఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న మంథని ఎమ్మెల్యే యూత్, మహిళా రైతు డిక్లరేషన్ల గురించి ఆలోచన చేయడం లేదన్నారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మంథని నియోజకవర్గాన్ని సింహ భాగం మంథని ఎమ్మెల్యే, ఆయన తండ్రి పాలించారని, ప్రస్తుతం 21నెలలు గడిచినా ఈ ప్రాంతంలో 21కార్యక్రమాలు చేయలేదని, 21మందికి ఉద్యోగాలు ఇప్పించలేదని విమర్శించారు. సోషల్మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. నల్లబాలు అలియాస్ శశిధర్ అనే వ్యక్తి ప్రభుత్వంపై కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి చీడ పురుగులాంటిదని వ్యాఖ్యానిస్తే అతనిపై కేసులు పెట్టి అరాచకం చేశారన్నారు.
ఈ విషయంలో హైకోర్టు ఆ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని, తొమ్మిది రాష్ట్రాల్లో కేసులను పరిశీలిస్తే కేసులన్ని కానిస్టేబుళ్లు ఎఫ్ఐఆర్ చేస్తున్నారని తేలిందని, ఇది అవమానకరమని హైకోర్టు వెల్లడించిందన్నారు. అంతే కాకుండా ఎవరిమీదనైతే ఆరోపణలు చేస్తరో ఆ వ్యక్తి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు. హైకోర్డు తీర్పు వెలువరించిన క్రమంలో మంథని పోలీసుల్లో మార్పు రావాలన్నారు. భారత రాజ్యాంగం మాత్రమే మీకు ఉద్యోగాలు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని విషయాన్ని గుర్తించాలన్నారు.
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేడు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు, భూములు చదువు ఉన్న వాళ్లకే ఓటు హక్కు ఇచ్చేదన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్లకు ఒక్కశాతం కూడా మంథని ఎమ్మెల్యే పని చేయలేదన్నారు. రాజకీయ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే మంచి పదవులు వస్తాయే కానీ పోలీసులు జైలుకు పోతే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని పోలీసులు గమనించాలన్నారు.
యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారని, బెల్ట్ షాపులు బంద్ చేయిస్తాం, రూ. 500ల బోనస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పిన మంత్రి వాటి అమలుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, తగరం శంకర్లాల్, కనవేన శ్రీనివాస్, మంథని లక్ష్మణ్, గొబ్బూరి వంశీ, ఆసీఫ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.