జగిత్యాల కలెక్టరేట్, మార్చి 25 : ప్రేమ పేరిట బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపినట్లు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి ప్రేమ్కుమార్ వాటర్ ప్రూఫింగ్ టెక్నీషియన్గా పనిచేస్తూ జగిత్యాల పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్నాడు.
ఐదేళ్ల కిందట ఆ యువకుడికి ఓ బాలిక పరిచయం కాగా, తర్వాత ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఇది నిజమని నమ్మిన ఆ బాలిక స్నేహం చేసింది. దీనిని ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు బలవంతంగా లైంగిక దాడి చేశాడు. తర్వాత గంజాయి అలవాటు చేసి తన ఇంటికి తీసుకెళ్లి పలుసార్లు లైంగికంగా వాడుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆమెను దూరంపెట్టాడు. 2022లో ఆ బాలికకు మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్ పరిచయమయ్యాడు.
వెంకటేశ్ సైతం ప్రేమిస్తున్నానంటూ బాలికకు గంజాయి ఇస్తూ బలవంతంగా లైంగికంగా వాడుకున్నాడు. ఆ తర్వాత వదిలించుకున్నాడు. ప్రస్తుతం సదరు బాలిక పదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటుండగా, ఇదే ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలుడు సైతం ప్రేమిస్తున్నానంటూ బాలికకు దగ్గరయ్యాడు. బాలికకు మత్తుపదార్థాలు ఇచ్చి బాలుడు సైతం లైంగికదాడి చేశాడు. తర్వాత బాలిక ప్రవర్తనలో తేడా రావడాన్ని గమనించిన తండ్రి, బాలికను అడుగగా పై విషయాలు తెలిశాయి. తన కూతురిని గంజాయి, మత్తు పదార్థాలకు బానిస చేసి, లైంగిక దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి ఈ నెల 23న జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మత్తుపదార్థాల వినియోగం వల్ల బాలిక మానసిక స్థితి సరిగా లేకపోవడంతో డీ అడిక్ట్ సెంటర్లో చేర్పించాడు. కాగా, బాలిక తండ్రి, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, డీ అడిక్ట్ సెంటర్ వారి స్టేట్మెంట్ ద్వారా ప్రేమ్కుమార్, వెంకటేశ్, బాలుడు వేర్వేరుగా ముగ్గురు బాలికకు మత్తుపదార్థాలు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నారని విచారణలో తేలింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రేమ్కుమార్, వెంకటేశ్ నుంచి 140 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై పోక్సో యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా సంయమనాన్ని పాటించాలని సీఐ సూచించారు. ఐపీసీ, పోక్సో, జువెన్సైల్ చట్టం-2015 ప్రకారం బాధితులకు సంబంధించిన ఐడెంటీని, సంబంధిత వ్యక్తుల వివరాలను ఏ రూపంలోనైనా బహిర్గతం చేస్తే సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.