Koya Sri Harsha | పెద్దపల్లి, మార్చి 9 : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు తెలంగాణ రాష్ర్ట పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పిస్తారని పేర్కొన్నారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతీ విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, కార్బన్ ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని పేర్కొన్నారు. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78వేల సబ్సిడీ అందిస్తుందని, ప్రతీ నెల దాదాపు రూ.2000 వరకు విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వీ గంగాధర్, డీఈ రాజ బ్రహ్మయ్య చారి, రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.