కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి. గతంలో పోలిస్తే భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. ఎక్కడ చూసినా పుష్కలంగా జలాలు కనిపిస్తుండగా, రైతులు సంబురపడుతున్నారు. రికార్డు స్థాయిలో వానలు పడడం, జలవనరులన్నీ నిండడంతో సంతోషపడుతున్నారు. ఇక వానకాలం, యాసంగి పంటలకు ఢోకా ఉండదని ఆనందపడుతున్నారు.
ఈ వానకాలం ఆలస్యంగానైనా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. జూలైలో గతంలో ఎన్నడూ లేనంతగా పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో జూలై సగటు వర్షపాతం కేవలం 237 మిల్లీ మీటర్లు కాగా, 661.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది. 424.2 మిల్లీమీటర్లు అదనంగా కురిసింది. జూలై 27న ఒక్క రోజులోనే 208.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో సాధారణం 434 మిల్లీమీటర్లు కాగా, 731 మిల్లీమీటర్లు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణం 224 మిల్లీమీటర్లు కాగా, 611మిల్లీమీటర్లు నమోదైంది. అలాగే పెద్దపల్లి జిల్లాలో సాధారణంగా 297.4 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఈ సారి అత్యధికంగా 635.7 మిల్లీమీటర్లు నమోదైంది. సెప్టెంబర్ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, రైతులు మరింత ఉత్సాహంతో సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంచనాల మేరకు ఎరువులు, విత్తనాలు, పరికరాలను వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు.
నిండుగా ప్రాజెక్టులు
వానకాలం సాగు కోసం గత నెలలో కాళేశ్వర జలాలను ఎత్తిపోశారు. అటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా శ్రీరాంసాగర్వైపు తరలించడంతోపాటు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని విడుదల చేశారు. దాదాపు పది రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగగా, అంతలోనే భారీ వర్షాలు పడ్డాయి. దాంతో వరద పోటెత్తింది. 27.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు)లో ప్రస్తుతం 20.34 టీఎంసీల నీళ్లున్నాయి. అలాగే మానేరు, మోయతుమ్మెద వాగులతోపాటు ఎస్సారార్ నుంచి వరదతో ఎల్ఎండీ జలాశయం నిండుకుండలా మారింది. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.044టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే పైనుంచి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా ఎస్సారార్, ఎల్ఎండీ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 32 అడుగులు (2 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం మత్తడి దుంకుతున్నది.
మత్తడి దుంకుతున్న జలవనరులు
ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో ఎక్కడ చూసినా చెరువులు, కుంటల్లోకి భారీగా వరద వచ్చింది. అప్పటికే కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న జలవనరులు నిండుకుండల్లా మారాయి. మెజార్టీ చోట్ల మత్తడి దుంకాయి. కొన్నిచోట్ల కట్టల మీదుగా పొంగాయి. ఏ చిన్న వానపడినా వందలాది చెరువులు మత్తడి దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాగులు, వంకలపై కట్టిన చెక్ డ్యాంలు కూడా మత్తళ్లు పడ్డాయి. మరోవైపు వరద కాలువకు ఉన్న 20కి పైగా తూముల ద్వారా దాదాపు 30కిపైగా చెరువులు నిండాయి. అందులో చాలా వరకు మత్తడి దుంకి దిగువ చెరువులను నింపాయి. ముఖ్యంగా వీణవంక, రామడుగు, కరీంనగర్ రూరల్ మండలాల్లోని చెక్ డ్యాంలు రిజర్వాయర్లను తలపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అయితే, 1096 చెరువులకు ఒక్క మంథని మండలం అడవిసోమన్పల్లిలోని మిడి చెరువు మినహా అన్నీ వందశాతం నిండాయి. మిడి చెరువు మాత్రం 50 శాతం మాత్రమే నిండింది. మరోవైపు జగిత్యాల జిల్లాలో దాదాపు 50 చెక్డ్యాంలు, సిరిసిల్ల జిల్లాలో 22, పెద్దపల్లి జిల్లాలో 6 చెక్ డ్యాంలు అలుగు దుంకుతున్నాయి.
ఆయిల్పామ్ సాగుకు అనుకూలం
ఉమ్మడి జిల్లాలో జలాలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు సాగు విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పప్పుదినుసులు, ఆయిల్ పామ్ తోటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే, వరదలతో ఇసుక మేటలు వేసిన ప్రాంతాల్లో అవసరమైతే ఆయిల్పాం సాగుకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
పుష్కలంగా నీళ్లు
భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా నీళ్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులతోపాటు చెరువులు కుంటలు నిండడంతో పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు 3.68 మీటర్లలోనే అందుబాటులో ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో గత నెల 9 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇటీవలి వానలతో 4.99 అడుగుల పైకి వచ్చాయి. బోర్లలో 150 అడుగుల్లోనే పుష్కలంగా నీళ్లున్నాయి.
ఆనందంలో రైతులు
ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం, ఇటీవల భారీ వర్షాలు పడడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయి. వానకాలమే కాదు యాసంగి సీజన్కు ఢోకా లేకుండా సాగుకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో రైతులు సంతోష పడుతున్నారు. ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడ్డాయని, ఇక రెండు పంటల సాగుకు రంది లేదని సంబురపడుతున్నారు. దాదాపు పది రోజులపాటు పడిన వానలు కొన్ని రోజుల నుంచి గెరువివ్వడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచగా, వాటిని కొని ఇంటికి తెచ్చుకుంటున్నారు.
సాగునీటికి రంది లేదు
మంత్రి కేటీఆర్ చొరవతో మా ప్రాంతానికి సాగునీటి కొరత లేకుండా పోయింది. గోదావరి జలాలు వచ్చినయ్. మండుటెండల్లోనూ ఎగువ మానేరు, చెరువులు అలుగులు దుంకినయ్. చివరి మడి వరకు నీళ్లందినయ్. ఎగువ మానేరుకు మల్లన్నసాగర్ నీళ్లు వచ్చినయ్. మా తంగళ్లపల్లి మండలంలోని పంట చేన్లకు రంగనాయక్సాగర్ నుంచి గోదావరి జలాలు తరలివచ్చినయ్. సాగునీటికి రంది పోయింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్న ఉద్దేశంతో నాకున్న పదకొండు ఎకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేస్తున్న. యాసంగిలో ఎకరానికి 36 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొత్తరకం వంగడాలతో దిగుబడి మంచిగొచ్చింది.
– విజేందర్రెడ్డి, రైతు (జిల్లెల్ల) మండలం
నీళ్ల గోస తీరింది
నాడు సాగునీళ్లు లేక మాకున్న నాలుగెకరాల్లో ఎకరం కూడా సాగు కాలే. ఎవుసం సాగక కూలీ పనికి పోయినం. వాగుల్లో ఇసుక దిబ్బలు తప్ప సుక్క నీరుండక పోయేది. వానొచ్చినప్పుడే వరద ఉండేది. తెలంగాణ వచ్చినంక మంత్రి కేటీఆర్ సార్ దయవల్ల మానేరు వాగులో ఏడాది పొద్దు నీళ్లుంటున్నయ్. మధ్యమానేరులో ఎదురెక్కి వచ్చిన నీళ్లతో వాగుపొంటి ఉన్న పొలాలకు పుష్కలంగా నీరందింది. మోటర్లు పెట్టి వాగులో పైపులేసి పంటలకు నీళ్లు పెట్టినం. ఈసారి వానలు దంచికొట్టి చెరువులన్నీ నిండినయ్. వానకాలమే కాదు యాసంగి పంటకూ రందిలేదు. నాలుగెకరాల్లో ఏసిన వరి దిగుబడి పెరుగుతుంది.
– వివేక్, రైతు (పాపయ్యపల్లె)
ఇసుక మేటలు ఆయిల్పామ్కు అనుకూలం
ఈసారి వర్షాలు కాస్త ఆలస్యం కావడం కొంత ఇబ్బంది కలిగించింది. కానీ, జూలైలో భారీ వర్షాలు పడ్డాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యంగానైనా సాగుకు సమాయత్తమవ్వాలి. సన్న రకాలనే పండించాలి. లాభాలను గడించాలి. పెద్దపల్లి జిల్లాలో వరదలతో ఐదు వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వాటన్నింటినీ గుర్తించాం. ఇసుక మేటలు ఉన్న రైతులు ఆయిల్పామ్ సాగుకు సిద్ధం కావాలి. మూడేళ్ల క్రితం జిల్లాలో 1200 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు మొదలు పెట్టాం. ఆ మొక్కలు ప్రస్తుతం గెలల దశలో ఉన్నాయి. మరో 6 నెలల్లో మొదటి క్రాప్ వస్తుంది. ఆయిల్ పామ్ ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 2700 ఎకరాల్లో మాత్రమే ఉంది. ఈ ఏడాది 15వేల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు రావాలి.
-దోమ ఆదిరెడ్డి, డీఏవో (పెద్దపల్లి)