చొప్పదండి నియోజకవర్గం.. నాడు దశాబ్దాల పాటు చీకట్లో మగ్గింది. ఎందరో మహామహులు ఏలినప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ఏండ్లపాటు కరువుతో అల్లాడింది. సాగుకే కాదు తాగునీటికీ తండ్లాడాల్సిన దుస్థితి ఉండేది. సరైన రోడ్లు లేక ప్రయాణానికి నరకం చూసింది. ఏ ఊరికి వెళ్లినా కష్టాలు, కన్నీటి గాథలే కనిపించగా, స్వరాష్ట్రంలో దశ తిరిగింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏండ్లనాటి దారిద్య్రం దూరమైంది. తాగు నీటి గోస తీరడమే కాదు, అటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీళ్లన్నీ జీవం పోసుకొని, అనతికాలంలోనే మరో కోనసీమలా మారింది. మొత్తంగా తొమ్మిదేండ్లలో 1,800 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెట్టగా, చొప్పదండి నియోజకవర్గం చూడచక్కగా తయారైంది.
– చొప్పదండి, మార్చి18
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం
గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలే. రోడ్లు, వంతెనలు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు, నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశ తిరిగింది. సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. అప్పుడు కష్టాలు, కన్నీళ్లతో బతికిన ప్రజల్లో ఇప్పుడు సంతోషం కనిపిస్తున్నది. కొండగట్టు దేవస్థానాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కానీ, సీఎం కేసీఆర్ 100 కోట్లు మంజూరు చేయడమే కాదు, అవసరమైతే మరో వెయ్యి కోట్లయినా ఇస్తానని హామీ ఇచ్చారు. నాడు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపాలిటీగా మార్చి, 67.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. శ్రీరాజరాజేశ్వర జలాశయం, గాయత్రీ పంప్హౌస్, రాంపూర్ పంప్హౌస్, నారాయణపూర్ రిజార్వాయర్, ఎల్లంపల్లి పైపులైన్ ద్వారా వచ్చే జలాలు, వరద కాలువ నీళ్లతో నియోజకవర్గం వాటర్హబ్గా మారింది. సాగుకు పుష్కలంగా నీరందుతూ సిరుల పంట పండుతున్నది. గత తొమ్మిదేండ్లలోనే నియోజకవర్గంలో సుమారు 1,800 కోట్లతో అభివృద్ధి జరిగింది. ఇంతకంటే ఏం కావాలి! సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంట.
– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే, చొప్పదండి
చొప్పదండి, మార్చి18: సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చొప్పదండి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు పార్టీలు ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధికి ఆమడ దూరంగా చీకట్లో మగ్గింది. గుక్కెడు నీళ్ల కోసం తపించని గ్రామం లేదు. నీళ్లు లేక ఎండని పంట లేదు. ఇంకా సరైన రోడ్లు లేక నరకం చూడని ఊరు లేదు. ఒకప్పుడు ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీటి కథలే వినిపించేవి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలోనే తన రూపురేఖలు సమూలంగా మార్చుకుంది. ఇపుడు తాగు నీటి గోసతీరింది. నారాయణపూర్ రిజర్వాయర్, కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన గాయత్రీ పంప్హౌస్తో సాగు నీటి కష్టాలు తొలగాయి. మెట్ట ప్రాంతాలన్నీ ఇపుడు పంటలతో సస్యశ్యామలంగా మారాయి. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్త్తూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నది. చొప్పదండి పట్టణంతోపాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాలకు రహదారుల సౌకర్యం పెరిగింది. నాటి మట్టి రోడ్లన్నీ ఇప్పుడు బీటీ రోడ్లుగా మారిపోయి కనిపిస్తాయి. ఏ పల్లెను చూసినా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
తీరిన ఏళ్లనాటి వంతెన కల
గతంలో వానకాలం వచ్చిదంటే వెంకటయ్యపల్లి వద్ద ఉన్న లోవెల్ వంతెన నీట మునిగేది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయేవి. వెంకటయ్యపల్లి, కాచిరెడ్డిపల్లి, కొండయ్యపల్లి, చర్లపల్లి (ఎన్), చర్లపల్లి (ఆర్) తదితర గ్రామాలకైతే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. ఈ గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ దాదాపు 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. వెంకటయ్యపల్లి వద్ద వంతెన నిర్మించాలని నాడు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 2017లో 1.25 కోట్లు మంజూరు చేయడంతోపాటు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడంతో ఆ గ్రామాల కష్టాలు తీరాయి.
దివ్యక్షేత్రంగా కొండగట్టు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని నాటి పాలకులు పట్టించుకోలేదు. ఏటా లక్షలాది మంది భక్తులు ఇబ్బంది పడుతున్నా ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. స్వరాష్ట్రంలో యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్, వేములవాడతోపాటు కొండగట్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. అంజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 100 కోట్లు మంజూరు చేశారు. అందుకు సంబంధించిన పనులు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత నెల 15న ఆలయాన్ని సందర్శించి అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే మరో వెయ్యికోట్లయినా ఇస్తానని ప్రకటించారు.
ప్రగతి దారుల్లో పల్లెలు
రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలతోపాటు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిదాయకమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి పల్లెలో వైకుంఠధామాల పేరిట శ్మశాన వాటికలు నిర్మించింది. సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి పల్లెలో పచ్చ దనం వెల్లివిరాయాలనే లక్ష్యంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి రోజూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నది. అంతే కాకుండా 10.80 కోట్లతో కొత్త పంచాయతీ భవనాలు, 5.71 కోట్లతో రైతు వేదికలను నిర్మించింది.
పవర్ ఫుల్ కరెంట్
నాడు విద్యుత్తు సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే కాదు, ఎక్కడికక్కడ బలోపేతం చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఉచితంగా సరఫరా చేస్తున్నది. కొత్తగా చొప్పదండి మండలం కాట్నపల్లిలో 33/11 కేవీ, గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలో మరో 33/11 విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంగాధర మండలం ఒద్యారంలో ఇటీవల మరో 33/11 విద్యుత్తు ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లో నిర్మించేందుకు మరిన్ని విద్యుత్తు ఉప కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంజూరు చేయించారు.
మెరుగైన వైద్య సేవలు
నియోజకవర్గంలో వైద్య సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. చొప్పదండిలో 30 పడకల దవాఖానాను ప్రారంభించారు. 30 లక్షల వ్యయంతో కొడిమ్యాల, మల్యాల పీహెచ్సీల్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 54 పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. గంగాధర, చొప్పదండి పీహెచ్సీలను బలోపేతం చేశారు. చొప్పదండి పీహెచ్సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారుస్తున్నారు. అంతేగాకుండా గంగాధర పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో మండలానికో 108 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
సర్కారుబడిలో నాణ్యమైన విద్య
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను, మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల, అదే మండలంలోని బూరుగుపల్లిలో మరో రెసిడెన్షియల్ పాఠశాల, చొప్పదండిలో సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే మన ఊరు మన బడి కింద చొప్పదండిలో 1.80 కోట్లతో 13, గంగాధర మండలంలో 2కోట్లతో 15, రామడుగులో 1.50 కోట్లతో 11 పాఠశాలలను పునరుద్ధరిస్తున్నారు.
మారిన రూపు రేఖలు
స్వరాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రమైన చొప్పదండి రూపురేఖలు మారుతున్నాయి. ఎమ్మెల్యే రవిశంకర్ చొరవతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండి మున్సిపాలిటీగా మారింది. 67.10 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులను చకచకా చేయిస్తున్నారు. 33 కోట్లతో గుమ్లాపూర్ చౌరస్తా నుంచి జవహర్ నవోదయ విద్యాలయం దాకా 4 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేస్తున్నారు.
తీరిన రోడ్ల కష్టాలు
తెలంగాణ రాక ముందు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. రామడుగు మండలం నుంచి కరీంనగర్ వెళ్లాలంటే నరకం కనిపించేది. 30 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు గుంతలమయమై దారుణంగా ఉండేది. స్వరాష్ట్రంలో వెదిర నుంచి గోపాల్రావుపేట దాకా డబుల్ రోడ్డు నిర్మించారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారిలో హనుమాన్ ఆలయం దాకా డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణాన్ని చేపట్టారు. మధురానగర్ చౌరస్తా నుంచి హన్మాన్ ఆలయం దాకా 4కోట్లతో యుద్ధప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మించి సెంట్రల్ లైటింగ్ కోసం డివైడర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణంతోపాటు సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. చొప్పదండి నుంచి రామడుగు దాకా మరో రోడ్డు ప్రగతిలో ఉంది. గుమ్లాపూర్ రోడ్ నుంచి మల్లన్నపల్లి, కాట్నపల్లి దాకా మరో రోడ్డు పూర్తయింది. చాకుంట ఎక్స్ రోడ్ నుంచి చాకుంట దాకా చేపట్టిన, గంగాధర మండలం బూరుగుపల్లి నుంచి కొండయ్యపల్లి వరకు చేపట్టిన మరో రోడ్డు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా నియోజకవర్గంలో ఆర్అండ్బీ ద్వారా రోడ్ల నిర్మాణానికి 142 కోట్లు, వంతెన నిర్మాణానికి మరో 28 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రోడ్ల కోసం 106.68 కోట్లు ఖర్చు చేసి అన్ని గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరిచారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని రహదారులకు బీటీ రెన్నోవేషన్ పనుల కోసం నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
బోడగుట్టలపై చిట్టడవి
చొప్పదండి మండలంలోని వెదురుగట్టలోని బోడగుట్టలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో చిట్టడివి తయారైంది. మూడున్నరేండ్ల కిందటి వరకూ ఆ ఐదు గుట్టలపై ఎటు చూసినా రాళ్లురప్పలే ఉండేవి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి బదులుగా, ఇక్కడ కేటాయించిన భూమిలో అటవీ శాఖ 178 ఎకరాల విస్తీర్ణంలో 80 లక్షలు ఖర్చు చేసి లక్ష మొక్కలు నాటింది. ఒక్కో మొక్కను కంటికి రెప్పలా కాపాడడంతో మూడున్నరేండ్లలో పదేండ్ల ఫలితాన్ని ఆవిష్కరించి రిజర్వ్ ఫారెస్టునే సృష్టించింది.
మరో కోనసీమలా..
నాడు చొప్పదండి నియోజకవర్గం కరువుతో తండ్లాడేది. ఏమండలానికి కెళ్లినా దుర్భిక్ష పరిస్థితులుండేవి. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కోనసీమను తలపిస్తున్నది. కాశేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 5 వేల కోట్లతో లక్ష్మీపూర్లో గాయత్రీ పంప్హౌస్ నిర్మాణమైంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో వదిలేసిన మిడ్మానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను రాష్ట్ర సర్కారు పూర్తి చేసింది. 25.87 టీఎంసీల ఈ రిజర్వాయర్ను ఇప్పటికే నిండుకుండలా మార్చింది. మరోవైపు ఎస్సారెస్పీ పునర్జీవంలో భాగంగా వరదకాలువను జీవనదిలా మార్చింది. వరదకాలువపై మొత్తం మూడు పంప్హౌస్లు నిర్మించగా, అందులో ఒకటి మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మించింది. ఇంకోవైపు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం పంప్హౌస్ నుంచి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు నేరుగా నీటిని పంపింగ్ చేస్తున్నది. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ దాకా వేసిన పైపులైన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కాగా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం 28 కోట్లతో పునరుద్ధరించింది. వీటితోపాటు రామడుగు మండలంలోని మోతె ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇదే వాగుపై ఓటీల నిర్మాణానికి 241 కోట్లు, వరద కాలువ ఓటీల నిర్మాణానికి 248 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే 37.19 కోట్లతో నియోజకవర్గంలో 18 చెక్ డ్యాంలు నిర్మించింది. మొత్తంగా ఈ ప్రాజెక్టులన్నింటి ఫలితంగా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, నియోజకవర్గం సస్యశ్యామలమైంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన మెట్ట ప్రాంతమైన నియోజకవర్గం ఎటుచూసినా పచ్చని పంటలతో కళకళలాడుతున్నది.
ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చెందింది
మన దగ్గర ఉన్నన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. ఈ సీఎం కేసీఆర్దే. తెలంగాణ రాక ముందు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేది. రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు రెప్పపాటు కూడా పోవడం లేదు. కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చెందింది. ఆయన దూరదృష్టితో చేసిన ప్రణాళికలే అందుకు కారణం. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే పాలనలో ఎంత పారదర్శకత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రజాసంక్షేమం కోరుకున్న నాయకుడు. ఆయన ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.
– పచ్చునూరి తిరుపతి, విద్యా ఫౌండేషన్ చైర్మన్, సామాజిక వేత్త (చొప్పదండి)
ఇంటికచ్చి చెక్కు ఇచ్చిన్రు
సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి తెచ్చి మా లాంటోళ్లకు భరోసా కల్పించారు. ఇసొంటి పథకాలు దేశంలోనే ఎవ్వలు అమలు చేస్తలేరు. కల్యాణ లక్ష్మి వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు సుతం ఆడపిల్లలకు 18 ఏండ్లు దాటినంకే పెండ్లిళ్లు చేస్తున్నరు. మేం ఎవుసం చేసుకుంటెనే బతికెటోళ్లం. మా బిడ్డ శైలజ పెండ్లికి కల్యాణలక్ష్మి కింద లక్షా 116 ఇచ్చిన్రు. మా ఎమ్మెల్యే రవిశంకర్ మా ఇంటికచ్చి చెక్కు ఇచ్చిపోయిండు. ఎన్కట ఆపీసుల పొంటి తిరిగినా కనికరించెటోళ్లుగాదు. ఇప్పుడు ఎమ్మెల్యే అంతటోడే ఇంటికచ్చి చెక్కులిచ్చిపోతండంటే మాటలుగాదు. కల్యాణలక్ష్మితో ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న గొప్ప మనసున్న మారాజు కేసీఆర్.
– రేండ్ల కనకలక్ష్మి- రాజిరెడ్డి, కొండన్నపల్లి (గంగాధర)
రైతుబీమా మా ఇంటిని ఆదుకున్నది
మాకు గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివార్ల ఆరు గుంటల ఎవుసం భూమి ఉన్నది. అది నా భర్త కృష్ణ పేరు మీద ఉండె. ఆరు గుంటల భూమి ఉండేది. అందులో కూరగాయలు పెట్టెటోళ్లం. కృష్ణ ఊరిల డిష్ ఆపరేటర్గా పని చేసేటోడు. 2018 డిసెంబర్ల రోడ్డు ప్రమాదంల చనిపోయిండు. మా కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. ఇద్దరు ఆడపిల్లలు, మీదికెళ్లి రెండు లక్షల అప్పు ఎట్ల బతుకుతమని రందివడ్డ. ఆరు గుంటల భూమి ఉన్న మా కుటుంబానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం భరోసా ఇచ్చింది. నా భర్త పేరు మీద రైతుబీమా ఉన్నది. నామినీగా ఉన్న నాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చిన్రు. దేవుడు ఎట్లుంటడో చూడలేదుగానీ మాకైతే సీఎం కేసీఆరే దేవుడిలెక్క నిలిచిండు.
– సముద్రాల రజిత, కురిక్యాల (గంగాధర)