కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 16 : సీమాంధ్రుల పాలనలో పాలకుల విచ్చలవిడి విధానంతో అటవీ సంపద తగ్గింది. కాలుష్య కారకాలు పెట్రేగి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగింది. స్వరాష్ట్ర కల సాకారమైన అనంతరం కేసీఆర్ కాలుష్యాన్ని అరికట్టి ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, హరిత ఉద్యమానికి నాంది పలికారు. ప్రతి ఏటా జులై నెల నుంచి అక్టోబర్ వరకు ప్రజలు, అధికారులకు లక్ష్యం విధించి మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ, అక్కడా అని కాకుండా ప్రభుత్వ, పరంపోగు, బంచరాయి, గుట్టలు, రోడ్లు, ఇళ్ల పక్కన, వ్యవసాయ భూములలో పొలం గట్లపై కూడా మొక్కలు నాటించారు. వాటి సంరక్షణ బాధ్యతలు కూడా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు, గ్రామాలలో పంచాయతీలకు అప్పగించారు.
బాధ్యతలు విస్మరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులను పురమాయించారు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు పట్టు వదలని విక్రమార్కుడిలా హరితహరంపై ప్రత్యేక శ్రద్ధ చూపగా, నాడు నాటిన కోట్లాది మొక్కలు నేడు వట వృక్షాలుగా మారాయి. ఫలితంగా పర్యావరణం పెరగటంతో పాటు, ఎడారికి పర్యాయ పదంగా మారిన కరీంనగర్ భూములు పచ్చదనాన్ని పులుముకున్నాయి. 8 శాతమున్న అటవీ సంపద 13 శాతానికి పెరిగింది. రహదారులపై ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు సేద దీరెందుకు గతంలో కనుచూపు మేరలో కూడా కానరాని చెట్లు, నేడు అడుగుకోటి చొప్పున ఏపుగా పెరిగాయి.
మండే ఎండల్లో ప్రయాణించే వారికి చల్లని నీడనిస్తూ ఉపశమనం కలిగిస్తుండగా నాటి సీఎం కేసీఆర్ అభినవ అశోకుడిగా ప్రజలు కొనియాడారు. ఇదంతా ఏడాది క్రితం నాటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. నాటిన మొక్కల సంరక్షణ కరువైంది. వాటికి నీరు పోయాలని సిబ్బందిని పురమాయించేందుకు పాలక వర్గాలు లేవు. అధికారుల పట్టింపు అంతకన్నా లేదు. చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. దీంతో, పంట పొలాల్లోకి నీడ వస్తుందంటూ రైతులు, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్నాయంటూ విద్యుత్ శాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. మరోవైపు నరికిన మండలు ఎక్కడివక్కడే వదిలేయగా, ధూమపాన ప్రియులు తాగి విసిరేసే బీడీ, సిగరెట్లతో అగ్గిరాజుకుని, బుగ్గి పాలవుతున్నాయి. ఏపుగా పెరిగినచెట్లన్నీ మోడువారిపోతున్నాయి. వాటి అవశేషాల బూడిద రహదారులపై వెల్లె ప్రయాణీకుల కళ్లను కప్పుతుండగా ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి.
జిల్లాలో శనిగరం నుంచి మొదలు దుబ్బపల్లి వరకు, కరీంనగర్ నుంచి గంగాధర, ఒద్యారం, చొప్పదండి వరకు రహదారులకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన అవెన్యూ ప్లాంటేషన్లు ఆహుతి అవుతున్నాయి. మంటలకు ఏపుగా పెరిగిన చెట్ల మండలు మాడి మసి అయిపోతున్నాయి. ఇన్నాళ్లు నిత్యం పోదనతో నడి ఎండల్లో సైతం ఆకుపచ్చ రంగును సంతరించుకుని ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కనీస పర్యవేక్షణ కరువవటంతోనే ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా కోట్లాది రూపాయల ఖర్చుతో పెంచిన మొక్కలు ఎదుగకముందే అగ్గిపాలవుతుండగా, పర్యావరణం దెబ్బతింటుందని, పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో ప్రయాణం చేసే తమకు చెట్ల నీడ కరువవుతున్నదంటూ బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అవెన్యూ ప్లాంటేషన్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరమున్నదనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి.