కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 25 : మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటమాడుతుండటం ఏమేరకు సమంజసమని పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వారికందించే ప్రయోజనాల్లో కోత పెట్టేందుకు రూపొందించిన పెన్షన్ వాలిడేషన్ యాక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన ప్రదర్శనలో భాగంగా బుధవారం జిల్లాలోని పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది మార్చి 25న బిజేపి ప్రభుత్వం పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని దొడ్డి దారిన పార్లమెంటులో ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఈచట్టంతో పెన్షనర్లకు కొత్త కష్టాలు మొదలు కాబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్లో కోత మొదలు కానుందన్నారు.
ఈ చట్టం మూలంగా జనవరి 1, 2026కు ముందు, తర్వాత అని పదవీ విరమణ చేసిన వారిని రెండు వర్గాలు విడదీయబోతుందని మండిపడ్డారు. రిటైర్ అయిన వారికి పెన్షన్ పెంపుదల చేయకుండా, ఆరునెలలకోసారి కరువు భత్యం చెల్లించకుండా తప్పించుకునేందుకే కొత్త చట్టాన్ని కేంద్రం తెచ్చిందని విమర్శించారు. వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
రైతు చట్టాల అమలులో కేంద్రం వెనక్కు తగ్గినట్లు, పెన్షనర్స్ వాలిడేషన్ యాక్టు అమలును కూడా రద్దు చేసే దాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.పీవీఏను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి జిల్లా యంత్రాంగం ద్వారా వినతిపత్రం పంపించారు.
ఈకార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జివి మనోహర్ కుమార్, జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ పొలాస రామచంద్రం, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పెరుక నాగమోహన్, ప్రతినిధులు ఎస్. శంకరస్వామి, కర్ర రాజిరెడ్డి, ఖాజాశంషాద్దిన్, కె.వెంకటరమణ, సీనియర్ పెన్షనర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.సత్యనారాయణ, కోశాధికారి పద్మారావు, అసోసియేట్ అధ్యక్షుడు కె. రాజమల్లు, పి. లచ్చయ్య, బి గంగాధర్, సిహెచ్ రమణాచారి, పి.శంకరయ్య, దామెర రాజమణి, బి మల్లారెడ్డి పాల్గొన్నారు.