గోదావరిఖని, అక్టోబర్ 19: పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే వారిచ్చే ఆరు గ్యారెంటీలేమోకానీ రాష్ట్రంలో అంధకారం అలుముకోవడం ఖాయమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. అరవై ఏండ్లు పాలించిన ఆ పార్టీ ప్రజలకు విద్య, వైద్యం, తాగునీరు, కరెంట్ లాంటి కనీస వసతులు కల్పించలేదని విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అలవికానీ హామీలను ఇస్తున్నదని మండిపడ్డారు. బూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. ఖని చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మంత్రి..పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకానీ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎన్నికల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ హాయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో..పోతుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు. అనేక మంది రైతులు రాత్రికరెంట్కు బలయ్యారని ఆవేదనవ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధి శరవేగంగా సాగిందన్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రం పురగోమిస్తున్నదని చెప్పారు. కార్మిక, రైతు, గ్రామీణ పేదలకు విద్య, వైద్యం, సంక్షేమ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా పేరుతో రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
మళ్లీ గెలిస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని. పింఛన్లను పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే ఎకరాకు 16 వేల చొప్పున రైతుబంధు అందిస్తామని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరిట 15 లక్షలకు పెంచనున్నామన్నారు. వీటితోపాటు సౌభాగ్యలక్ష్మి ద్వారా పేద మహిళలకు 3వేల జీవన భృతి అందజేస్తామన్నారు. 400కే వంట గ్యాస్ ఇస్తామని చెప్పారు. సమావేశంలో నగర మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, నాయకులు మూల విజయారెడ్డి, కెంగర్ల మల్లయ్య, గండ్ర దామోదర్ , కార్పొరేటర్లు రాజ్కుమర్, కృష్ణవేణి, కుమ్మరి శ్రీను, నాయకులు పీటీ స్వామి, మాదాసు రాంమ్మూర్తి, శంకర్ గౌడ్, మారుతి, తానిపర్తి గోపాల్ రావు, జేవీ రాజు, బొడ్డు రవీందర్, అచ్చ వేణు ఉన్నారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే తెలంగాణలో రాబోయేది స్వర్ణ యుగమే. శిశువుకు తల్లి ఒడి రక్ష.. రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. కేసీఆర్ పధ్నాలుగేండ్ల ఏండ్ల పోరాటం, నిరంతర మేధోమథనం, నిత్య పరిశీలనతో రూపొందించిన సంక్షేమ పథకాల అమలుతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు దేశానికి దిక్సూచిగా మారాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నివర్గాలకూ మేలు చేసే పథకాలతో మ్యానిఫెస్టోను ప్రకటించారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపిస్తే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎవరూ మద్దతు పలుకలేదు. ప్రధాని మోదీ రామగుండానికి వచ్చిన సందర్భంలో బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేయబోమని చెప్పి మాట తప్పారు. సబ్బండ వర్ణాలు బాగుండాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– బోర్లకుంట వెంకటేశ్నేతకాని, పెద్దపల్లి ఎంపీ
బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణి మనుగడ సాధ్యం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనలో కేసీఆర్పై నీలాపనిందలు వేయడం బాధాకరం. కాంగ్రెస్ పాలనలో లోపాయికారి ఒప్పందాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులకే బొగ్గు బ్లాకులను కేటాయించింది. నాటి మంత్రి దాసరి నారాయణరావే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి మేము కారణం కాదు. బీజేపీ, బీఆర్ఎస్పైనే నెపం వేస్తూ తప్పించుకో జూస్తున్నది. సింగరేణి గనుల ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీజేపీని చిత్తుగా ఓడించాలి.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి