ధర్మారం, మార్చి 3 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్హౌస్లో ఆరు రోజులుగా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా వచ్చిన నీటిని ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరదాకా నీటి పంపింగ్ కొనసాగించి ఆ తర్వాత నిలిపి వేస్తున్నారు. కాగా, బుధవారం 1, 7 నెంబర్ల మోటర్లను నడిపించి, 3,150 క్యూసెకుల చొప్పున 2 మోటార్ల ద్వారా 6,300 క్యూసెక్కుల జలాలను నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోయించారు.
అయితే, బుధవారం ఎత్తిపోసిన నీటిని నంది రిజర్వాయర్కే పరిమితం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ కు వెళ్లకుండా రిజర్వాయర్ మెయిన్ గేట్లను మూసివేశారు. నంది రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 233 మీటర్లు కాగా 229 వరకు నీటిని నిల్వ చేసినట్లు అధికారులు వెల్లడించారు.