పెద్దపల్లి : లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న 77 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేశామని కలెక్టర్ తెలిపారు. మధ్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో మిగిలిన 56 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
డిసెంబర్ 1,2021 నుంచి నవంబర్ 30,2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని, ప్రతి షాపు కు రూ.2 లక్షల నాన్ – రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వైన్ షాపు కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ మొదలైన అంశాల షెడ్యుల్ను అబ్కారీ శాఖ కమిషనర్/సంచాలకులు ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ జే.రవి కుమార్, బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.