Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 6: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి బ్లీచింగ్ పౌడర్ బయటకు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక పరిధిలోని ఆయా డివిజన్లలో వివిధ అవసరాలకు వినియోగించే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ అధికారుల పర్యవేక్షణ లేక కింది స్థాయి సిబ్బంది సహాయంతో ప్రైవేటు పనులకు కూడా తరలిస్తున్నట్లు తెలిసింది.
కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకులను శుద్ధి చేయడానికి, పరిసర ప్రాంతాలలో దుర్గంధం తొలగించడానికి, సూక్ష్మజీవుల నివారణకు ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాలకు వాడాల్సిన బ్లీచింగ్ పౌడర్ను కార్యాలయంలోని వెనుక భాగంలో గల ఓ స్టోర్ రూమ్ లో భద్రపరుస్తారు. వీటి కొనుగోళ్లకు నగర పాలక సంస్థ ఖజానా నుంచి ఏటా రూ. లక్షలు వెచ్చిస్తుంటారు. ఐతే మాజీ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తి గత పనుల నిమిత్తం కార్యాలయం నుంచి బ్లీచింగ్ పౌడర్ ను డివిజన్ లో వివిధ పనుల పేరు చెప్పి తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
వర్షాకాలం కావడంతో ఆయా డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ను చల్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతారు. ఈ స్టోర్ రూమ్ లో ఉన్న నిల్వలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐతే కార్యాలయానికి వెనుక వైపు ఉండటంతో అధికారులు అంతగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇదే ఆసరాగా చేసుకొని కొందరు మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు డివిజన్లలో పనుల పేరు చెప్పి తమ ఇంటి అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చి బ్లీచింగ్ పౌడర్ను అప్పనంగా తీసుకెళ్తున్నట్లు తాజా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఇవి పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ ను వివరణ కోరగా అలాంటిది తమ దృష్టికి రాలేదనీ, ఒకసారి పరిశీలిస్తామని తెలిపారు.