పెద్దపల్లి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : తండ్రి హమాలీ. తల్లి కూలీ. చదివింది ఇంటర్. అయినా తనకాళ్లపై ఎదగాలనుకున్నాడు రామగిరి మండలం బేగంపేటకు చెందిన పోలుదాసరి దేవేందర్. మూడేళ్ల క్రితం రాఘవాపూర్ పరిధిలో పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారి పక్కన ఇటుక బట్టీల మధ్య ఎకరంన్నర మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. ఏటా ఎకరాకు రూ. 40వేల చొప్పున ఎకరంన్నరకు రూ. 60వేలు తోట యజమానికి చెల్లించాడు. తోట చుట్టూ బట్టీల వేడికి మొదటి ఏడాది సరిగా కాత రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అయినా నిరాశ చెందలేదు. ఎలాగైనా ఇక్కడే లాభాలను ఆర్జించాలని అనుకున్నాడు. తోటలో నాటుకోళ్లు, కడక్నాథ్, కౌంజులు పెంచాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రెండేళ్ల క్రితం మూడు ఫాంలు ఏర్పాటు చేశాడు. ఒక ఫాంలో కడక్నాథ్ కోళ్లు, మరో ఫాంలో కౌజు పిట్టలు, ఇంకో ఫాంలో నాటుకోళ్లు వేశాడు. ఒక్కోఫాంలో 1500 చొప్పున పెంచుతున్నాడు. వీటితోపాటు పందెం కోళ్లు, సీమకోళ్లు, బాతులు, హంసలు పెంచి విక్రయిస్తున్నాడు. బాతులు, హంసల కోసం తోటలో సెలయేరులా కాలువను తవ్వాడు. అక్కడక్కడా ఫాంపాండ్లను నిర్మించాడు. తోటలో ఉన్న మోట బావికి మోటర్ బిగించి నీళ్లను పారించాడు. పుంజులు, పందెం కోళ్లు తోటలో తిరుగుతుండగా, వాటికి అవసరమైన దాణాను తానే స్వయంగా తయారు చేసి పెడుతున్నాడు.
ఫాం వద్దే విక్రయాలు..
మార్కెటింగ్ కోసం కొంత మంది హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడుకున్నాడు. వారికి నాటుకోళ్లు, కడక్నాథ్ కోళ్లు, బాతులు, హంసలు, కౌజు పిట్టలు, కోడిపిల్లలు విక్రయిస్తున్నాడు. ఫాం ఆనుకునే రోడ్డు ఉండగా, అందరికీ తెలిసేలే రోడ్డుపై శ్రీలక్ష్మీ కడక్నాథ్ కోళ్ల ఫాం అని బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. డిమాండ్ మంచిగా ఉండడంతో ఫాం వద్దే విక్రయాలు జరుపుతున్నాడు. ఆరు నెలలకు నాటుకోళ్లను 600 వరకు.. కౌజు పిట్టలను 1500 వరకు.. కడక్నాథ్ కోళ్లను 800 వరకు విక్రయిస్తున్నాడు. నాటుకోళ్లను కిలోకు 350 చొప్పున.. కడక్నాథ్ కోళ్లను 450 చొప్పున.. కౌజుపిట్టలను జతకు 150 చొప్పున అమ్ముతున్నాడు. వీటితోపాటు బాతులు, హంసలు, సీమకోళ్లు, పందెంకోళ్లను విక్రయిస్తున్నాడు. గుడ్లను కూడా తక్కువ ధరకే ఇస్తున్నాడు. ఇలా ఏడాదికి సుమారు 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
మామిడితోనూ లాభం..
చుట్టూ ఇటుక బట్టీలు ఉండడంతో వేడికి మామిడి చెట్ల పూత రాలిపోయింది. రెండో ఏడాది నుంచి పూత రాలకుండా ఉండేందుకు సేంద్రియ ఎరువులను వాడడంతో ఫలితం కనిపించింది. దిగుబడి బాగా పెరిగింది. మామిడి పండ్లను హోల్సేల్గా విక్రయించడంతోపాటు రోడ్డు పక్కనే కుప్పలుగా పోసి కిలోకు 50కిపైనే అమ్మాడు. సీజన్లో 30వేలకుపైనే సంపాదించాడు.
మామిడి తోటే నా ప్రపంచం
నాకు ఈ మామిడి తోటే ఓ మార్గం చూపింది. ఎకరంన్నర తోటకు రూ.60వేల లీజు చెల్లిస్తున్న. గిట్టుబాటు అయితలేదని అనిపించింది. కోళ్ల ఫాం పెట్టాలనే ఆలోచన వచ్చింది. నాకు తెలిసిన కొంత మందిని విచారించిన. బాగుంటదని ప్రోత్సహించిన్రు. దీంతో ముందు కోడి పిల్లలు(చిక్స్)ను అమ్మడం ప్రారంభించిన. 30 మంది ఫాంల వాళ్లను కలిసిన. వారికి కోడి పిల్లలను తెచ్చి ఇవ్వడం ప్రారంభించిన. మిగిలిన కోడి పిల్లలను ఇక్కడ పెంచడం ప్రారంభించిన. ఇక్కడే ఓ బోర్డు పెడితే రోడ్డు వెంట వెళ్లే వారు వస్తారనే ఆలోచన వచ్చింది. అంతే వెంటనే బోర్డు పెట్టి విక్రయాలు ప్రారంభించిన. నాటుకోళ్లు, పందెం కోళ్లు, కడక్నాథ్ కోళ్లు, కౌజులు, బాతులు, హంసలు వాటి గుడ్లు ఇలా అన్నీ ఇక్కడే విక్రయిస్తున్న. లాభదాయకంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది.
-పోలుదాసరి దేవేందర్, బేగంపేట (రామగిరి మండలం)