పెద్దపల్లి, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పెద్దపల్లిలో ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న బహిరంగ సభను గొప్పగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. తొలిసారి జిల్లాకు వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. సభ విజయంతానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రామగుండం ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీలు టీ. భానుప్రసాదరావు, ఎల్. రమణతో కలిసి ఆయన సీఎం సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, డీపీవో, మున్సిపల్ కమిషనర్తో ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ బహిరంగ సభ కు జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షమంది వస్తారని తెలిపారు.
వివిధ నియోజకవర్గాల వారిగా వాహన పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశామని వెల్లడించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ నుంచి పెద్దపల్లికి చేరుకొని తొలుత కలెక్టరేట్ కార్యాలయం, తర్వాత టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తదనంతరం కలెక్టరేట్ ఎదుట సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఆయన రాకకోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పా రు. జిల్లా ఏర్పాటుతోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్ సార్ సభకు పెద్దసంఖ్య లో హాజరై కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారి వెంట టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాఖేశ్, బాలమల్లు, పెద్దపలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లా హరిశంకర్, బోనాలశ్రీకాంత్,కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు.