పెద్దపల్లి, మే 31(నమస్తే తెలంగాణ): అది సుల్తానాబాద్ మండలం కదంబాపూర్. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న గ్రామం, కమ్యూనిటీ హాల్స్కు కేరాఫ్ అడ్రస్లా నిలుస్తున్నది. ‘రాష్ట్రంలోని అన్ని కులాలకు ‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని, స్థలాలు గుర్తించామని కొద్దిరోజుల క్రితం ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సర్పంచ్ కోడెం సురేఖ-అజయ్ దంపతులు తమ గ్రామంలో నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ప్రతి కులానికి ఒక భవన్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే..
సీఎం కేసీఆర్ కేసీఆర్ గొప్ప దార్శనికుడు. ఆయన ఆలోచన విధానం చాలా గొప్పది. ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు కానీ కేసీఆర్ సార్ లాంటి మార్క్ పాలన ఇదివరకు జరుగలేదు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూడాలనే ఆయన సంకల్పం గొప్పది. ఆయన ఆశయం మాకు నచ్చింది. మా గ్రామంలోనూ ప్రతి కమ్యూనిటీకి ఒక భవన్ ఉండాలని అనుకున్నాం. సీనరేజ్ నిధులతో భవన్లు, ప్రహరీ, ఇతర నిర్మాణాలు చేపట్టాం. ఇంకా సీనరేజీ నిధుల్లో రూ. 30లక్షల దాకా ఉన్నాయి. వాటితో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. భార్యా భర్తలమైన మాపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.
– కోడెం సురేఖ-అజయ్, సర్పంచ్, కదంబాపూర్
గ్రామాభివృద్ధిలో సర్పంచ్ దంపతుల ముద్ర
కదంబాపూర్ గ్రామం 1986లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అనేక సమస్యలతో దశాబ్దాలపాటు కొట్టుమిట్టాడింది. పైగా గ్రామంలో ఉన్న ఐదు గుట్టలపై గ్రానైట్ క్వారీలు వెలువడడంతో ఊరు ఇంకా సమస్యల్లోకి వెళ్లింది. రోడ్లు అధ్వానమయ్యాయి. పంచాయతీ భవనం శిథిలావస్థలోకి చేరింది. ఈ క్రమంలో 2015లో సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కోడెం అజయ్ ఎన్నికయ్యాడు. అజయ్ విద్యావంతుడు కావడంతో గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గ్రామంలో నడుస్తున్న గ్రానైట్ క్వారీల నుంచి సీనరేజ్ నిధులు పంచాయతీకి రావడం లేదని గుర్తించి హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏ గ్రామ పరిధిలో అయితే గ్రానైట్ క్వారీ ఉంటుందో ఆ పంచాయతీకి 25శాతం, మండల ప్రజా పరిషత్కు 50శాతం సీనరేజ్ ఫండ్స్ ఇవ్యాలని 2001లో అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా, ఈ విషయం పైనే కేసు నడిచింది. ఈ క్రమంలో కదంబాపూర్ పంచాయతీకి 25శాతం సీనరేజ్ నిధులను కేటాయించాలని 2017 హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో పంచాయతీకి రూ.3,76, 25,000 మంజూరయ్యాయి. వీటితో గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు వేశాడు. సీఎం కేసీఆర్ అప్పటికే హైదరాబాద్లో రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వారికి స్థలాలను ఇచ్చి, సామాజిక భవనాలను నిర్మించడం మొదలు పెట్డడంతో ఆ దిశగా ఆలోచించాడు. భవనాల నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తిరిగి 2019లో జనరల్ స్థానమైన ఇక్కడి నుంచి తిరిగి తన భార్య కోడెం సురేఖను బరిలో నిలిపి గెలిపించుకున్నాడు. ప్రస్తుతం సురేఖ సర్పంచ్గా కొనసాగుతున్నారు. భర్త ఆలోచలకు అనుగుణంగా పనిచేస్తూ, అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు.
తొమ్మిది కులాలకు భవనాలు..
గ్రామ జనాభా 2,200 ఉండగా, 380 ఇండ్లు, కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ తొమ్మిది కులాలు, హిందూ, ముస్లిం సోదరులు ఉన్నారు. ఈ క్రమంలో సీజనరేజ్ నిధులు రూ.3కోట్ల 76లక్షలతో గ్రామంలో కులానికి ఒక ఆత్మగౌరవ భవనాన్ని నిర్మింపజేశారు. యాదవ, ఎస్సీ, కుర్మ, కుమ్మరి శాలివాహన, రెడ్డి ఓబీసీ, అంబేద్కర్ ఆడిటోరియం, బీసీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనం, మత్స్యపారిశ్రామిక సంఘం భవనానికి ప్రహరీ, ముస్లింల సౌకర్యార్థం షాదీఖానా, ఇదే కాదు స్వాతంత్య్ర సమరయోధుడు, గ్రంథాలయాల ఉద్యమ నాయకుడు బోయినిపల్లి వెంకటరామారావు స్మారకార్థం గ్రంథాలయ భవనం.. ఇలా ఒక్కో భవనాన్ని రూ.8లక్షల వ్యయంతో సకల హంగులతో నిర్మించారు. ఇంకా రూ.30లక్షలతో గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తేగా, గ్రామస్తులు సంబురపతున్నారు.