పెద్దపల్లి, మే 12 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్ : ‘పల్లె సీమలే ప్రగతి మల్లెలు.. పచ్చదనం-పరిశుభ్రతే గ్రామ సౌభాగ్యం’ అనే నినాదం స్పూర్తితో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. గతంలో చెత్తా చెదారం, దుర్గంధం వ్యాపించిన పల్లెల్లో నేడు పరిశుభ్ర పరిమళాలు వెదజల్లుతున్నాయి. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నది. పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లతో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. చెత్త తరలింపు, మొక్కలకు నీళ్లు పట్టడం వంటి ముఖ్యమైన పనుల్లో వినియోగిస్తుండడంతో ఖర్చు ఆదా అవడమే కాకుండా ఉపాధిహామీ ద్వారా వస్తున్న నిధులతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. గతంలో మొక్కకు నీళ్లు పట్టేందుకు ఒక్కో ట్రిప్పుకు 600 చొప్పున ప్రైవేట్ ట్యాంకర్లకు చెల్లించాల్సి వచ్చేది. అలాగే, చెత్త సేకరణకు ఉపయోగించే ట్రాలీలకు కూడా అద్దె చెల్లించాల్సి వచ్చేది.
వీటిని ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించేది. కానీ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీలు సొంతంగా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశాయి. వీటితోనే ఇప్పుడు పనులు చేయిస్తున్నాయి. ఫలితంగా చాలాగ్రామాల్లో ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఖర్చు ఇప్పటికే తిరిగివచ్చాయి. మరికొన్ని గ్రామాల్లో సగం డబ్బులు వచ్చాయి. ఇలా 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 180కోట్లు పంచాయతీల అకౌంట్లలో జమయ్యాయి. అత్యధికంగా మంథని మండలం గోపాల్పూర్ జీపీకి 20.14 లక్షలు రాగా, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల జీపీకి 13లక్షలకుపైగా వచ్చాయి. మొత్తంగా ట్రాక్టర్ రాకతో గ్రామాల రూపురేఖలు మారుతుండగా, సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రెండో ట్రాక్టర్ కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దిందని చెబుతున్నారు.
పరిశుభ్ర పల్లెగా గోపాల్పూర్..
మంథని మండలం గోపాల్పూర్లో రోజూ ఉదయం ట్రాక్టర్ ట్రాలీ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. సాయంత్రం ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా హరితహారం మొకలకు నీళ్లు పడుతున్నారు. దీంతో 90 శాతం మొక్కలు దక్కడమే కాకుండా ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. గతంలో ఇందుకు వెచ్చించిన ఉపాధిహామీ నిధులను గ్రామపంచాయతీ ఖాతాలో జమచేస్తున్నారు. ఇప్పటి వరకు జీపీకి 20.14 లక్షలు వచ్చాయి. ట్రాక్టర్ కొనుగోలు చేసిన డబ్బులు ఇప్పటికే తిరిగి వచ్చేశాయి. ట్రాక్టర్కు 6 లక్షలు, ట్యాంకర్, ట్రాలీకి 2 లక్షలు వెచ్చించగా, ఆ డబ్బులు ఇప్పటికే తిరిగి వచ్చాయి. పైగా భవిష్యత్లోనూ ఇదే రీతిలో ఆదాయం రానున్నది.
అవసరాలన్నీ తీరుస్తున్నది
గ్రామపంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్ అన్ని అవసరాలను తీరుస్తున్నది. గతంలో మొక్కలకు నీళ్లు పోయాలంటే ఒక్క ట్యాంకర్కు 600 అయ్యేది. పక్క ఊరి నుంచి 300 మొక్కలు తేవాలంటే ట్రాక్టర్ కిరాయి 2వేలయ్యేది. ఒక్కరోజు గ్రామంలో చెత్త సేకరించాలంటే రూ.వెయ్యి అయ్యేది. ట్రాక్టర్, ట్యాంకర్ రావడంతో ఈ ఖర్చులన్నీ తప్పాయి. ట్యాంకర్ ద్వారా మొకలకు నీళ్లు పోయడంతో దాదాపు 95శాతం బతికాయి. ఉపాధిహామీ ద్వారా పంచాయతీకి 20.14లక్షలు జమయ్యాయి. గ్రామం క్లీన్ అండ్ గ్రీన్గా మారింది.
– కెక్కర్ల సునీత-సత్యనారాయణ, గోపాల్పూర్ సర్పంచ్
రెండో ట్రాక్టర్నూ కొనుగోలు చేశాం
మాది మేజర్ గ్రామ పంచాయతీ. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామపంచాయతీకి మొదట ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేశాం. ట్రాలీ, ట్యాంకర్ను సమకూర్చుకున్నాం. గ్రామం పెద్దది కావడంతో ఒక్క ట్రాక్టర్తో చెత్త సేకరణ, మొక్కలకు నీళ్లు పట్టడం ఇబ్బందిగా మారింది. తర్వాత రెండో ట్రాక్టర్ను కొనుగోలు చేశాం. ఉదయం, సాయంత్రం చెత్తను సేకరిస్తున్నాం. మొక్కలకు నీళ్లు పడుతున్నాం. ట్రాక్టర్లతో ఈజీఎస్ ద్వారా ఆదాయం వస్తున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం బాగుంది.
మారిన పల్లెల రూపురేఖలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాక్టర్లతో పల్లెల రూపురేఖలు మారాయి. పరిశుభ్రత, పచ్చని చెట్లతో గ్రామాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లతో చెత్త సేకరణతో పారిశుధ్యం మెరుగుపడింది. ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పడుతుండగా పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నది. జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. తంగళ్లపల్లి, గంభీరావుపేట, రుద్రంగి, లింగన్నపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో రెండేసి ట్రాక్టర్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 261 ట్రాక్టర్లు ఉన్నాయి. జిల్లాలో నాటిన 95 శాతం మొక్కలను సంరక్షించడం విశేషం. గతంలో మొక్కలకు నీళ్లు పట్టేందుకు ఒక్కో ట్యాంకర్కు ఈజీఎస్ నుంచి 600 చెల్లించారు. పంచాయతీకో ట్రాక్టర్ రావడంతో ఇందుకు వెచ్చించే ఈజీఎస్ నిధులను నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకు 2019 సెప్టెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు ట్రాక్టర్ల ద్వారా 11కోట్ల ఆదాయం జీపీల ఖాతాల్లో జమ కాగా, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల జీపీకి 13 లక్షలకు పైగా వచ్చాయి. అలాగే, 2021 సంవత్సరానికి జిల్లా పరిషత్, ముస్తాబాద్ మండలం చీకోడు, తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ పంచాయతీలకు జాతీయ పురస్కారాలు వరించిన విషయం తెలిసిందే.