పెద్దపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)/ రామడుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వదేశానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వరకు నలుగురు చేరుకోగా, మరొకరు సోమవారం వచ్చారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లి పట్టణంలోని మొఘల్పురాకు చెందిన సయ్యద్ ఈషాన్ రసూల్ కుమార్తె సాహెర్ ఫాతిమా క్షేమంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఇదే కాలనీకి చెందిన సయ్యద్ ఖదీర్ కుమారుడు సయ్యద్ ఖాలిద్ ఒమన్ మంగళవారం రాష్ర్టానికి చేరుకునే అవకాశం ఉన్నది. వీరిద్దరూ ఉక్రెయిన్లోని ఇవానో ఫ్రానివిస్ సిటీలోని ఇవానో ఫ్రానివిస్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వారిని దేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. దీంతో సాహెర్ ఫాతిమా తన సహచర విద్యార్థినులతో కలిసి హైదరాబాద్ రాగా, అక్కడి నుంచి సోమవారం సాయంత్రం పెద్దపల్లికి చేరుకుంది. సయ్యద్ ఖాలీద్ ఒమన్ రుమానియా ఎయిర్పోర్టు నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరాడు. ఆయన మంగళవారం రాష్ర్టానికి చేరుకునే అవకాశం ఉంది.
బయటపడ్డ సుమాంజలి
రామడుగు మండలం రాంచంద్రాపూర్కు చెందిన కడారి రాజయ్య, ఎల్లమ్మ చిన్నకూతురు సుమాంజలి ఎట్టకేలకు కీవ్ నగరం నుంచి బయటపడింది. తెలుగువారితో కలిసి రైలులో రుమేనియావైపు బయలుదేరినట్టు ఆమె సోదరుడు స్వామి తెలిపాడు. ఉక్రెయిన్లోని జప్రోజియా స్టేట్ మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న సుమాంజలి యుద్ధం నేపథ్యంలో ఈ నెల 24న ఉక్రెయిన్ రాజధాని కీవ్కు తెల్లవారుజామున చేరుకున్నది. ఆ తర్వాత రోజే గగన తలాన్ని మూసివేయడంతో స్థానిక మెడికల్ కళాశాలలోని బంకర్లో తలదాచుకున్నది. అక్కడ ఆహారం కూడా అందక నాలుగు రోజుల పాటు అవస్థలు పడ్డది. సోమవారం అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో సుమాంజలి కీవ్ నుంచి లివ్యూకు బయలుదేరింది. అక్కడి నుంచి రుమేనియా సమీపంలోని చేర్నిన్సీ చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కీవ్ నుంచి మూడు రైళ్లు మారాల్సి ఉంటుందని, తమ కూతు రు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సుమాంజలి తల్లిదండ్రులు పేర్కొన్నారు.