ధర్మారం, ఏప్రిల్ 7: మండల కేంద్రంలో గొల్ల, కుర్మలు నిర్వహిస్తున్న బీరన్న గుడి వద్ద దేవుడి కల్యాణోత్సవం నిర్వహణకు షెడ్డు నిర్మాణం చేయిస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఈ నెల ఒకటి నుంచి గొల్ల, కుర్మలు ధర్మారంలోని బీరన్న నూతన గుడి వద్ద నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన నాగవెల్లికి మంత్రి హాజరై మాట్లాడారు. సంప్రదాయ పద్ధతిలో బీరన్న ఉత్సవాలను గొల్ల, కుర్మలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బీరన్న కల్యాణోత్సవం నిర్వహణకు కల్యాణమండపం, ఆవరణలో బోర్వెల్ సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాయంత్రం సమయంలో మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ హాజరయ్యారు.
కాగా, సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ధర్మపురి నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఇన్చార్జి అమరపల్లి నారాయణ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, యాదవ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు తమ్మడవేని మల్లేశం, యాదవ సహకార సంఘం మండలాధ్యక్షుడు జంగ మహేందర్, వార్డు సభ్యులు తుమ్మల ఓదెలు, దాగేటి లావ ణ్య, ఆవుల మల్లేశం, దాగేటి అనిల్, నాయకులు సులిగె శేఖర్, దాగేటి భూమయ్య, అరుకుటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.