కోల్ సిటీ, మార్చి 8 : ఆదివారం సెలవు దినం..పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రపంచమంతా మగువ శక్తిని, త్యాగాన్ని, విలువను కీర్తించే నేపథ్యం..వారి సేవలను సత్కరించే సందర్భం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థలో ఆదివారం సెలవు రోజున మహిళ కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా…? అంటూ పలువురు విశ్లేషకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సెలవు రోజున విరామం లేకపోవడం మహిళలను మానసిక క్షోభకు గురిచేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థతో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందిచే మహిళా దినోత్సవం రోజున సైతం శానిటేషన్ పనులు చేయించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందులో మహిళా కార్మికులు సైతం రోడ్లు ఊడ్చుకుంటూ పనులు చేయడం పట్ల పలువురు బహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళా దినోత్సవం రోజున సన్మానాలు, సత్కారాలు జరిగేవని మహిళా కార్మికులు గుర్తు చేసుకున్నారు. మహిళా దినోత్సవం రోజున కూడా పాపం.. మహిళ కార్మికులకు ఎక్కడుంది విరామం…? ఇదేనా గౌరవం..! అంటూ పలువురు అటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు.