Lingapur : లింగాపూర్ గ్రామ సమీపంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. క్రికెట్ ఆడుతుండగా బావిలో పడిన బంతిని తీసుకునే క్రమంలో సాత్విక్(13) అనే బాలుడు మరణించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న సాత్విక్ మరణంతో అతడి తల్లిందడ్రులు అయ్యో దేవుడా ఎంత ఘోరం జరిగిందంటూ గుండెలుబాదుకుంటున్నారు. అంతర్గాం మండలం రామగుండం పోలీస్టేషన్ పరిధిలోని మోడల్ స్కూల్లో జరిగిన ఈ విషాదకరమైన ఘటనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్లో ఉండిపోయారు.
ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ లింగాపూర్ గ్రామ సమీపంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి అతడు క్రికెట్ ఆడుతుండగా బంతి స్కూల్ ప్రహారి గోడ అవతల పడింది. బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సాత్విక్ స్కూల్ ప్రహార గోడ ఎక్కాడు. ప్రమాదవశాత్తూ అతడు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.
సాత్విక్ బావిలో పడడం గమనించిన స్నేహితులు, తోటి విద్యార్థులు సుశాంత్, వర్షిత్లు.. అతడిని కాపాడానికి బావిలోకి దిగారు. వారు ప్రయత్నం చేసినప్పటికి సాత్విక్ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న లింగాపూర్ గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు బావిలోంచి సాత్విక్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మోడల్ స్కూల్ ఎదుట భారీ సంఖ్యలో నిరసనకు దిగారు.