జగిత్యాల : నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం మారేడుపల్లి-ముంజం పల్లి గ్రామాల్లో పర్యటించి ఎండిపోతున్న పంటలను రైతులతో కలసి పరిశీలించారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే పంటలు ఎండిపోవని అన్నారు.
ఎస్సారెస్పీ పంప్ హౌస్ (SRSP Pump House) ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో ముంజంపల్లి, మారేడు పల్లి గ్రామాలకు చెందిన రైతులు 1800 ఎకరాల్లో వరి సాగు చేశారని , ప్రస్తుతం పొట్ట దశలో సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. కాలువ ద్వారా నీరు ఇవ్వని పరిస్థితుల్లో మారేడుపల్లి పక్కనే ఉన్న వేంనూర్ పంప్ హౌస్ నుంచి నంది రిజర్వాయర్ కు నీటిని తరలించే పైప్ లైన్ కు ఉన్న వాల్ ను విప్పి ఎస్సారెస్పీ 11 లెప్ట్ కాలువ లోకి వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చిని ఆయన సూచించారు. ఇప్పటికే 300 ఎకరాల వరి పొట్ట దశలో ఎండిపోయి, బీటలు వారుతున్నాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నంది రిజర్వాయర్ నుంచి రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ను తవ్వి ఖిలావననర్తి వద్ద ఎస్సారెస్పీ కలపాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కేసీఆర్(KCR) అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో 8.55 కోట్లు నిధులు మంజూరు చేశారని ఎన్నికలు రావడంతో పనులు జరగలేదని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీటి పారుదలపై స్పష్టత లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వసంత, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.