కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 01: ఈదురుగాలుల భీభత్సానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల, జగ్గయ్యపల్లె, వెన్నంపల్లి, కూనారం, మంగపేట గ్రామాల్లో వీచిన భారీ ఈదురుగాలులకు నేలవాలిన మక్క జొన్న, వరి పంటలను బుదవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మల్యాలలో మక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ ఈదురు గాలుల వల్ల మండలంలో సుమారు 450 ఎకరాల్లో మక్క, 275 ఎకరాల్లో వరి పంటలు నేలవాలాయన్నారు.
మక్క జొన్న పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలుపోసుకునే దశలో ఉన్న మక్క చేన్లు గాలులకు నేలమట్టం అయ్యాయన్నారు. చేతికచ్చిన పంట నేలవాలడంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో పంట నష్టం సర్వే చేయించి, వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఆయన వెంట సర్పంచ్ బూసి సదాశివరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ లోనే సదయ్య, మాజీ సర్పంచ్ జక్కె రవీందర్, బీఆర్ఎస్ నాయకులు ఎఠబాటి రవి, జూకంటి అనీల్, కామిడి వెంకట్రెడ్డి, జక్కె విష్ణువర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సాగర్ రెడ్డి, లెక్కల వేణుగోపాల్రెడ్డి, సంపత్ రెడ్డి, హరీశ్, కంది రమేశ్, సదాశివరెడ్డి, మల్లయ్య, వేల్పుల సంపత్, రఘుపతిరెడ్డి, సతీశ్, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.