కాల్వశ్రీరాంపూర్, మార్చి 22: యాసంగి పంటలకు సాగునీరివ్వడంలో రేవంత్ సర్కారు విఫలమైందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గుంట ఎండిపోకుండా నీరందించామని గుర్తు చేశారు. మోసపూరిత గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలప్లలిలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
ఆయాచోట్ల జడ్పీ చైర్మన్ పుట్టమధు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. కష్టపడి పనిచేసి పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించాలని శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని, ప్రజాసమస్యలపై పోరాడాలని నిర్దేశించారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు దగా పడ్డాయన్నారు. రైతుబంధును నిలిపివేసిందని, కల్యాణలక్ష్మిని ఆపేసిందని విమర్శించారు.
పింఛన్లు పెంచలేదు, మహాలక్ష్మి స్కీం ఊసేలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి టికెట్లు ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాగా, మీటింగ్లో కార్యకర్తలు కొప్పుల, దాసరిని ఘనంగా సత్కరించారు. కాల్వశ్రీరాంపూర్లో ఎంపీపీ నూనేటి సంపత్, కూనారం పీఏసీఎస్ చైర్మన్ గజవెళ్లి పురుషోత్తం, నాయకులు కొట్టె రవీందర్, నిదానపురం దేవయ్య, కరుణాకర్రావు పాల్గొన్నారు.