Peddapalli | పెద్దపల్లి, మార్చి15( నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సమ్మర్ సీజన్ను వినియోగించుకొని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్పై సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతిలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మత్తు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల, హాస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ సమ్మర్ సీజన్ పూర్తయ్యే లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఉపాధి హామీ కింద మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మార్చి 20 లోపు బిల్లులు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీష్ బాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.