మంథని రూరల్, జనవరి 19: ‘ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం. వారి సేవకే తన జీవితం అంకితం’ అంటూ బీఆర్ఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యువకులు అర్థం చేసుకొని వారి పన్నాగాలను తిప్పికొట్టాలని సూచించారు. గురువారం మండలంలోని మల్లెపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు దాటుతున్నా ఎందరో నిరుపేదలు ఆకలితో అలమటించడం బాధాకరమన్నారు. 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అణగారిన వర్గాలకు మేలు కోసం తపిస్తున్న తమను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. ‘అమ్మ పెట్టదు. అడుక్కు తిననివ్వదు’ అన్నచందంగా కాంగ్రెస్ వైఖరి ఉందని మండిపడ్డారు. తాను సంపాదించిన దాంట్లో కొంత పేద విద్యార్థుల అభ్యున్నతికి ఖర్చు పెడుతుంటే కాంగ్రెసోళ్ల కండ్లు మండుతున్నాయని విమర్శించారు. పేదల బాధలు తీర్చే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్లో మరింత ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, సర్పంచ్ ఎరుకల తిరుపతమ్మ, ఎంపీపీ కొండ శంకర్, అరెల్లి దేవక్క, జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్లాల్, మాదరవేన శారదాకుమార్, చెలుకల స్వర్ణలత అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్, అత్తె చంద్రమౌళి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, శంకేశి రవీందర్, పోతిపెద్ది కిషన్ రెడ్డి సర్పంచ్లు కనవేన శ్రీనివాస్ యాదవ్, బూడిద మల్లేశ్, నాయకులు ఎక్కటి అనంతరెడ్డి, పూదరి సత్యం ఉన్నారు.