పెద్దపల్లి టౌన్ నవంబర్ 9: పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ పెద్దపల్లిపై ఎగిరిది గులాబీ జెండానేని చెప్పారు. గురువారం మనోహర్రెడ్డి ఇంటివద్ద అర్చకులు పూజలు చేయించి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వేస్టేషన్ రోడ్లోని అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటి నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి బయల్దేరి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్దపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ మధుమోహన్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
తర్వాత పెద్దమసీదు నుంచి రాల్యీగా అమర్నగర్, ప్రగతినగర్, అయ్యప్ప దేవాలయం మీదుగా బస్స్టాండ్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా పెద్దపల్లిలో గులాబీ పార్టీ గెలవడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. తాను సీఎం కేసీఆర్ సహకారం, ఇక్కడి ప్రజల దీవెనలతో తొమ్మిదిన్నరేండ్లు రూ. 10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించానన్నారు. తెలంగాణ ప్రభుత్వ రైతుల కోసం రైతుబంధు, నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. దళితబంధు కింద నిరుపేద దళితకుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.
బీసీబంధు, మైనార్టీ బంధు ద్వారా రూ. లక్ష చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ గెలిపిస్తే నిరుపేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు అందిస్తామని, రూ400కే గ్యాస్ సిలిండర్, ఆసరా పెన్షన్ రూ. 5వేలు, వికలాంగుల పెన్షన్ రూ.6వేలు, రైతుబంధును రూ.16వేలకు పెంచడం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలుగా పెంచుతామని ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నా బియ్యం, రూ. 5లక్షల ప్రమాదబీమా లాంటి ఏన్నో ప్రయోజనాలు ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని దండంపెట్టి వేడుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్రావు, బీఆర్ఎస్ నాయకులు సీ. సత్యనారాయణరెడ్డి, మేకల మల్లేశం, వేముల రాంమూర్తి, తిరుపతిరెడ్డి, రాంరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.