ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి14: ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు. రైతులకు రూ.3.20కోట్ల పరిహారం ఇప్పించి కాలువ నిర్మాణం చేయిస్తారో.. లేదంటే పదవికి రాజీనామా చేస్తారో.. తేల్చుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
పది రోజుల్లో పనులు మొదలుకాకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం6 కెనాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సబ్స్టేషన్ సమీపంలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్నది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కిలోమీటర్నర ఉన్న కాలువను కూడా తవ్వించని ఎమ్మెల్యే ఐదేళ్లు పదవిలో ఉండి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాగునీళ్లు లేక యాసంగిలో పంటలు ప్రతి ఏడాది ఎండిపోతున్నాయని వాపోయారు. కాలువ నిర్మాణం చేపట్టే వరకు రిలేదీక్ష విరమించేది లేదన్నారు. 20గ్రామాల రైతులు ఏడాది కాలంగా కాలువ కోసం దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల రైతులు పాల్గొన్నారు.