పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రైతులను కష్టాల్లోకి నెట్టింది. కొనుగోలుదారులకు పది నెలలుగా పాసు బుక్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం పదిరోజుల్లోనే నేరుగా రైతు ఇంటికి పోస్టులో పాస్బుక్ వచ్చేది. కానీ, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి మారిపోయింది.
2025 ఏప్రిల్ 14న పోర్టల్ను అందుబాటులోకి తెచ్చి, అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నా పాసు పుస్తకాల జారీ మాత్రం నిలిచిపోయింది. వాస్తవానికి భూమికొన్న రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే ధీమా.. భరోసా! పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి విలువైన పాస్ పుస్తకాలను జారీ నిలిచిపోవడం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూ భారతి ప్రారంభించిన ఈ పది నెలల కాలంలో పెద్దపల్లి జిల్లాలో 31,522 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అందులో ఏ ఒక్కరికీ పట్టాదారు పాసు పుస్తకం రాలేదు. ఈ విషయమై తహసీల్దార్ల దగ్గరికి వెళ్లి అడిగితే ఆ బాధ్యత తమది కాదని, పూర్తిగా ప్రభుత్వానిది, కాంట్రాక్ట్ ఏజెన్సీలదేనని, ‘పాస్ పుస్తకాలు మీ ఇంటికే వస్తాయి’ అని సెలవిస్తుండడంతో తిరిగీ తిరిగి వేసారుతున్నారు. రుణాలు తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే పాసు బుక్కులు లేకపోవడంతో బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం రైతు భరోసా ఇవ్వరని, మరోవైపు బ్యాంకుల్లో అప్పు పు ట్టక సేద్యం ఎలా చేసేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటుగా డబ్బులు వడ్డీలకు తెచ్చుకొని అప్పుల పాలవుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాసు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు వడ్లూరి రాజేశ్వరరావు. ఊరు కాల్వశ్రీరాంపూర్. ఆయన తండ్రి నంబారావు పేరుమీద ఉన్న భూమిని 2025 నవంబర్లో గిఫ్ట్ డీడ్ చేయించుకున్నడు. కానీ ఇంత వరకు ఆయనకు పట్టాదారు పాసుబుకు రాలేదు. మూడు నెలలుగా తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నడు. అయినా రాలేదు. భూమిపై రుణం కోసం బ్యాంకుకు వెళ్తే పాస్బుక్ లేకపోతే ఇవ్వలేమని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పట్టా చేసుకున్న 15 రోజుల్లోపే ఇంటికే పాసుబుక్ వచ్చేదని, ఇప్పుడెందుకు రావడం లేదని వాపోతున్నడు.