దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగను జరుపుకొన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం రావడం, జలకళను సంతరించుకున్న సంతోషంతో పల్లె ప్రజలంతా సాయంత్రం ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లారు. కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి, యాటలతో మొక్కులు చెల్లించారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఆయాచోట్ల కట్టలపై ప్రజలు, నాయకులు, అధికారులు అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. నగర శివారులోని రేకుర్తి, కరీంనగర్ మండలంలోని చామనపల్లి, కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్లో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు చెరువుల వద్ద జరిగిన వేడుకలకు మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు.
– కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఊరు చెరువుపై ఉన్న మమకారాన్ని గ్రామ ప్రజానీకం చాటుకున్నది. ఎడారుల్లాంటి చెరువుల్లో నీటి వనరులు తొనికిసలాడిన చోట నీరాజనం పట్టింది. గురువారం ఊరూరా చెరువుల వద్ద పండుగ చేసుకున్నది. తెలంగాణ అవతరించిన తర్వాత మారిన చెరువుల ప్రతిరూపాన్ని చూసి మురిసిపోయింది. బోనాలు ఎత్తి, బతుకమ్మలు ఆడుతూ డీజే సౌండ్స్తో, డప్పు చప్పుళ్లలో చెరువుల వద్దకు చేరుకుని కట్ట మైసమ్మలకు గొర్రెలు, మేకలతో మొక్కులు తీర్చుకున్నారు. చెరువుల వద్దే వంటలు చేసుకుని కుల, మతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేశారు. అనేక చోట్ల మత్స్యకారులు చెరువుల్లో దొరిక చేపల కూర వండి వడ్డించారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో గల పెంటకమ్మ చెరువు, కరీంనగర్ మండలం చామనపల్లిలోని అప్పన చెరువు, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగులకు స్థానికులు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. చామనపల్లిలో బతుకమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఆసిఫ్నగర్లో బతుకమ్మలతో చెరువు వరకు ర్యాలీ తీశారు.
ఇక్కడ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. మానకొండూర్లోని పెద్ద చెరువు వద్ద ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. తిమ్మాపూర్లోనూ ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు. కట్టపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టం అందరినీ ఆకట్టుకున్నది. హుజూరాబాద్లో జరిగిన చెరువు పండుగకు మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హాజరవ్వగా, దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు. జీజే, డప్పు చప్పులు, బోనాలు, బతుకమ్మల ఆటా పాటలతో భారీ ఊరేగింపు తీశారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మండలి విప్తో పాటు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. వీణవంక మండలం ఎల్బాకలో జరిగిన వేడుకల్లోనూ మండలి విప్, ఇల్లందకుంటలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్, చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో చెరువు పండుగలు ఘనంగా జరిగాయి. రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన వేడుకలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు హాజరయ్యారు.