కరీంనగర్ రూరల్, డిసెంబర్ 23: కరీంనగర్ రూరల్ మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్ర ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి పల్లె ప్రగతి నిధులు రూ.2.50 లక్షల చొప్పున కేటాయించగా, 17 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. షెడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు వివరించారు. ఇంటికి రెండు చొప్పున బుట్టలు పంపిణీ చేశారు. దీంతో గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేస్తున్నారు. కాగా, ప్రతి గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ కొనుగోలు చేయగా, చెత్తను సెగ్రిగేషన్కు షెడ్డుకు తరలిస్తున్నారు. షెడ్డు ఆవరణలో చెత్తను డంప్ చేసిన అనంతరం పారిశుధ్య సిబ్బంది వేరు చేస్తున్నారు. కూరగాయలు, మాంసం, కోళ్ల వ్యర్థాలు, కుళ్లిపోయిన తినుబండారాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. అట్ట ముక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు, సీసాలను విక్రయిస్తుండగా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తున్నది. సేంద్రియ ఎరువును రైతులకు విక్రయించడంతో పాటు హరితహారం మొక్కలకు వేస్తున్నారు. అలాగే, మురుగు కాలువలను శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నం
జిల్లాకు 307 సెగ్రిగేషన్ షెడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 301 షెడ్ల నిర్మాణం పూర్తి చేశాం. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో చైతన్యం వచ్చింది. ఇండ్లల్లోని చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేస్తున్నరు. చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి వేరు చేస్తున్నరు.
-శ్రీలత, డీఆర్డీవో, కరీంనగర్
పంచాయతీకి ఆదాయం వస్తున్నది
గ్రామంలో సేకరించిన తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నం. పాత సామగ్రి, ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, అట్ట ముక్కలను విక్రయించడంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తున్నది. సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు వేయడంతో పాటు అవసరమున్న రైతులకు విక్రయిస్తున్నం.
-కటకం నందయ్య, సర్పంచ్, ఫకీర్పేట