సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణ మాఫీ గురువారం నుంచి అమలవుతుండడంతో రైతన్నలు ఖుషీ అయితున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుండడంతో పాటు తమ సెల్ ఫోన్లకు వస్తున్న మెస్సేజ్లు చూస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పలువురు సీఎం ఫొటోలు చేత పట్టుకుని నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్ని చోట్ల పంట పొలాల్లోనూ పాలాభిషేకాలు చేశారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా, పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంట్, ఇప్పుడు పంట రుణాలు మాఫీ చేస్తూ తమకు అండగా నిలుస్తున్న కేసీఆర్ సారు రుణం తీర్చుకోలేమంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
పంట రుణమాఫీ గురువారం నుంచి అమలవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొందరికి మాఫీ కాగా, మిగతా వారికి తక్షణమే చేయాలని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజు నుంచే నగదు తమ ఖాతాల్లో జమవుతుండడంతో అన్నదాతలు సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు శుక్రవారం సైతం పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. పంట క్షేత్రాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు చేతపట్టుకుని ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ రైతుబాంధవుడికి రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
రూ. 38వేలు మాఫీ అయినయ్..
నేను 2017 ఆగస్టు 9న మా ఊరిలోని గ్రామీణ బ్యాంకుల రూ.35 వేల క్రాప్లోన్ తీసుకున్న. 2018 నాటికి మిత్తితో కలిపి రూ.38,304 అయింది. అప్పటి నుంచి ఏడాదికోసారి రెన్యువల్ చేసుకుంటున్న. ఇయ్యాళ ఆ మొత్తం మాఫీ అయినట్లు బ్యాంకు నుంచి నా ఫోన్కు మెస్సేజ్ అచ్చింది. నేను బ్యాంకుకు వెళ్లి పైసలు తీసుకున్న. కొంచెం ఆలస్యమైనా రుణం మొత్తం మాఫీ చేయడం సంతోషంగా ఉన్నది. వ్యవసాయదారులకు మంచి జేస్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
రుణమాఫీతో రైతులకు ఊరట..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పడంతో ఊరట లభించింది. కొంత ఆలస్యంగానైనా ఇచ్చిన మాట మేరకు లోన్ను మాఫీ చేయడం సంతోషంగా ఉన్నది. ఆంధ్రోళ్ల పాలనలో రైతులకు ఒరిగిందేంలేదు. తెలంగాణ వచ్చినంకనే వ్యవసాయదారులకు అన్నివిధాల మేలు జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రెండు పంటలకు సాగునీరందుతుంది. రైతుబంధుతో పెట్టుబడికి బాధ తీరింది. ఇప్పుడు ఏకంగా రూ. లక్ష దాకా రుణాలు మాఫీ చేసిన ఈ సర్కారుకు రుణపడి ఉంటం.
-గాదె మధూకర్రెడ్డి, యువరైతు, చిప్పకుర్తి, రామడుగు
కేసీఆర్ సారుపై అపారమైన నమ్మకం..
నేను ఐదేండ్ల కిందట పంట రుణం తీసుకున్న. అప్పటి నుంచి క్రమంగా వడ్డి చెల్లించి రెన్యువల్ చేసుకుంటున్న. అయితే ఎన్నికలు కాగానే మాఫీ అవుతుందని అనుకున్న. కానీ కరోనా రావడంతో ప్రభుత్వానికి రాబడి తగ్గడంతో లోన్ మాఫీ చేయలేదు. అయితే కొంత ఆలస్యంగానైనా రుణాన్ని మాఫీ చేయడం ఆనందంగా ఉన్నది. రైతులకు అంతా మంచి జేస్తున్న సీఎం కేసీఆర్ మీద అపారమైన నమ్మకం. ఆయనతోనే వ్యవసాయదారులకు మేలు జరుగుతున్నది.
-పొన్నం సునీత, మన్నెంపల్లి (తిమ్మాపూర్)
రైతుల పాలిట దేవుడు
నాకు వారసత్వంగా ఎకరన్నర పట్టా భూమి వచ్చింది. నేను దొంగతుర్తి గ్రామీణ బ్యాంక్ల 2014ల రూ.40 వేల రుణం తీసుకున్న. అది మళ్లీ కట్టిన. తర్వాత రూ.65 వేలు తీసుకున్న. రెండ్రోజుల కింద ముఖ్యమంత్రి 2018కి ముందు తీసుకున్న లోన్లు మాఫీ చేయాలని చెప్పినంక నా లోన్లో రూ.40,345 మాఫీ అయినట్లు నా సెల్కు మెసేజ్ వచ్చింది. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద మెసేజ్ రావడంతో బ్యాంక్కు వెళ్లి తెలుసుకున్న. వాళ్లు కూడా నా రుణం మాఫీ అయినట్లు చెప్పిన్రు. హామీ ఇచ్చినట్టే రైతుల రుణం మాఫీ చేసిన కేసీఆర్ సారు రైతుల పాలిట నిజంగా దేవుడే. ఆయనే మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులంతా కోరుకుంటున్నరు.
– జంగిలి గట్టుస్వామి, రైతు, ఖిలావనపర్తి (ధర్మారం)
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు
నేను 2018ల కథలాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ల రూ.40 వేలు పంట అప్పు తీసుకున్న. ఆ తర్వాత కొన్ని రోజులకు సీఎం కేసీఆర్ సారు రూ.లక్ష లోపు ఉన్న పంట అప్పులను మాఫీ చేస్తమని మాటిచ్చిన్రు. సారు ఇచ్చిన మాట ప్రకారం నా అప్పు రూ.40,700 మాఫీ చేసిన్రు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలె.
– పెంట లత, మహిళా రైతు సిరికొండ(కథలాపూర్)
సీఎం కేసీఆర్ మా అదృష్టం
రైతుల మేలు కోరే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం. పోయిన ఎన్నికలప్పుడు రూ.లక్ష లోపు రుణం మాఫీ చేస్తానని చెప్పిండు. గట్లనే ఇప్పుడు మాఫీ చేస్తుండు. నేను కొలనూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ల 2017 అక్టోబర్ 31న రూ.35 వేల పంట రుణం తీసుకున్న. 2018 డిసెంబర్ 11 నాటికి వడ్డీతో రూ.38,892 అయినయ్. ఇప్పుడు ఆ రుణం మాఫీ అవుతున్నట్లు నా సెల్ఫోన్కు ఈరోజు మెసేజ్ వచ్చింది. ఇది చూసి బ్యాంకుకు పోయి ఆ పైసలు తీసుకున్న. దేశంలో ఎక్కడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడనే అనుకుంటున్న. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతులకు ఏది కావాల్సి వస్తే అది చేస్తండు. రైతుల పక్షాన ఉన్న ఆయనకు కృతజ్ఞతలు.
– పల్లె సతీశ్, రైతు, కొలనూర్ (ఓదెల)