మెప్మా రిసోర్స్ పర్సన్లు మురిసిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంటింటా అవగాహన కల్పిస్తూ, చైతన్యం తీసుకువచ్చే ఆర్పీల గౌరవవేతనాన్ని 4వేల నుంచి 6వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు చాటారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ప్రతినబూనారు.
మారుతీనగర్, సెప్టెంబర్ 28:తమ గౌరవవేతనాన్ని 4వేల నుంచి 6వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మెప్మా రిసోర్స్ పర్సన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ సభ్యులు మాట్లాడుతూ, తాము 20 ఏండ్లుగా మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్నా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా వినతిని మన్నించి, మా కష్టాన్ని గుర్తించి వేతనం పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తెలియజేస్తున్నాం. వృద్ధులకు పింఛన్, మహిళల రుణాలతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్, తదితర కార్యక్రమాల్లో మా వంతు కృషి చేస్తున్నాం. మేం చేస్తున్న పనులను గుర్తించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.2వేలు గౌరవ వేతనం పెంచడం అభినందనీయం. ఉత్సాహంగా పని చేసేందుకు మా కోరికను మన్నించి తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. కేటీఆర్కు రుణపడి ఉంటాం.
– ఓడ్యాట్ శ్రీదేవి, మెప్మా ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలు (మెట్పల్లి)
పదమూడేండ్ల నుంచి మున్సిపల్ కార్యాలయంలో పనులు చేస్తున్నా. చాలీ చాలని వేతనంతో కష్టాలు పడ్డాం. మేం చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. గౌరవ వేతనం పెంచి మాకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సార్లకు రుణపడి ఉంటాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రభుత్వ ఆక్షాంక్షలకు అనుగుణంగా మరింత ఉత్సాంగా పని చేస్తాం.
– పుల్ల శోభారాణీ, మెప్మా ఆర్పీ (మెట్పల్లి)