Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నందనవం సూరిపై గతంలో వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తన మొదటి భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అతనిపై నగర బహిష్కరణ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి నందనవనం వెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడకు చేరుకున్నాడు. ముందుగా సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సూరి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.