మల్యాల, ఫిబ్రవరి 22 : స్వరాష్ట్రంలో ఆలయాలకు పునర్జీవం పోస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 100 కోట్ల నిధులు మంజూరు చేయడమే కాదు, కొండగట్టును దేశంలోనే గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతానని, అవసరమైతే వెయ్యి కోట్లయినా ఇస్తానని ప్రకటించినదీ విదితమే. ఈ నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంగళవారం నియోజకవర్గంలోని అన్ని హనుమాన్ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టగా, బుధవారం ముత్యంపేట గ్రామస్తులు తమ గ్రామ పరిధిలో ఉన్న కొండగట్టుకు 3కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టారు. ముత్యంపేట-కొండగట్టు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటికి ఒకరు చొప్పున కదిలారు.
సుమారు వెయ్యి మందికి పైగా గ్రామ పంచాయతీ నుంచి పాదయాత్రగా బయలుదేరి, ఘాట్రోడ్డు గుండా కొండపైన ఉన్న వై జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వైజంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేసి, ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా అంజన్న ఆలయం పునర్నిర్మాణంతోపాటు ఆలయ పరిసరాలు అభివృద్ధి జరుగాలని కోరుకుంటూ ముడుపులు కట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మ్యాక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.