గొల్లపల్లి/వెల్గటూర్, అక్టోబర్ 26: ‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అనేక పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. మన మ్యానిఫెస్టోకు ఏ పార్టీ ఎన్నికల ప్రణాళిక సరిరాదు. నేను కచ్చితంగా చెబుతున్నా. రాష్ట్రంలో వచ్చేది మన కేసీఆర్ ప్రభుత్వమే. అభివృద్ధి చేసేది మనమేనని’ మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. గురువారం గొల్లపల్లి మండలం తిర్మలాపూర్, గుంజపడుగు, అగ్గిమల్లలో ప్రచారం చేశారు. కాగా, తమ కనీస అవసరాలన్నీ తీర్చిన, గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పల్లెపకృతి వనం, వైకుంఠధామాలు నిర్మించిన మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలగా ఆయా గ్రామాల్లో ప్రజలు తరలివచ్చారు. ఈశ్వర్కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.
మళ్లీ విజయం మీదేనంటూ’ మహిళలు వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. స్వరాష్ట్రంలో పింఛన్లు, రైతు బంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్, సాగు, తాగు నీటితోపాటు అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసింది నిజమే అయితే మళ్లీ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. వచ్చే ఐదేండ్లు మీ పిల్లలు, మీ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ బీమాతో ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా, ప్రతి పేదింటి మహిళకు నెలకు రూ.3 వేలు, ఇప్పుడిస్తున్న రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.16 వేలు, ఇప్పుడిస్తున్న పింఛన్లు రూ.5 వేల దాకా అందిస్తామని చెప్పారు. అలాగే తెల్లరేషన్ కార్డున్న వారికి సన్నబియ్యం అందిస్తామన్నారు.
ఒకనాడు అంధకారంలో ఉన్న తెలంగాణను, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లలో రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని కొనియాడా రు. కాంగ్రెస్ పార్టీకి వారంటీ లేదని, వాళ్లు ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా..? అంటూ ప్రశ్నించారు. వారి పాలిత రాష్టాల్లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి పాలిత రాష్ర్టాల్లో హమీలకు దిక్కులేదు కానీ, ఇక్కడ ఆరు హామీలంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సర్పంచులు ఎరవేణి రమేశ్, సరిత రవి, శంకరవ్వ, ఎంపీటీసీ లు లావణ్య జల్పతి, రాజ్యలక్ష్మి రవి, ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలంధర్, ఏఎంసీ చైర్మన్ హ న్మాండ్లు, పాక్స్ చైర్మన్లు రాజసుమన్ రావు, మాధవరావు, వైస్ చైర్మన్ నవ్వ తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ లింగా రెడ్డి, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, యూత్ అధ్యక్షుడు రవీందర్, కన్వీనర్లు గంగాధర్, రాంచందర్ రెడ్డి, అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి ఉన్నారు.
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 120 మంది నాయకులు గులాబీ గూటికి చేరారు. గ్రామంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బూరగడ్డ మౌనిక, జాడి దుష్యంతరాణి, జాడి రాధ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, సర్పంచ్ మారం జలేందర్రెడ్డి, నాయకులు జీరెడ్డి మహేందర్రెడ్డి, మామిడిపల్లి రామయ్య, రామడుగు రాజేశ్, కోడి గంగయ్య, ఎండీ రియాజ్, కంది విష్ణు, పడిదం మొగిళి, నారాయణ, వెంకటేశ్, కాటు రవి ఉన్నారు.