ధర్మపురి, సెప్టెంబర్ 25: ‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తెలంగాణ మహిళలు దేశంలోనే ఆదర్శం నిలవాలి’ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ధర్మపురిలోని ఓ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయిలో 80 మహిళ సమైక్య భవనాల నిర్మాణాలకు 4కోట్ల విలువైన ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసి, మంత్రి మాట్లాడారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. మహిళలకు అవకాశాలు వస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మి, మహిళలను కేంద్రీకృతం చేస్తూ తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కానీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అధికార యావ తప్ప.. అభివృద్ధిపై ధ్యాస లేదని, మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అమలుకానీ, సాధ్యం కాని పథకాలు అమలు చేస్తామని హామీలు ఇస్తూ మభ్య పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో సైతం ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చి గెలిచిన తర్వాత చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కరెంటు కోతలపై అక్కడి ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదని, ఇది వారి పరిస్థితి అని ధ్వజమెత్తారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఈ తొమ్మిదేండ్లలో దేశం అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు.
మోడీ పాలనను గమనిస్తే చేసిన వాగ్దాలనాలకు విరుద్ధంగా అసమర్థ, అసంబద్ధ పాలన విధానాల ద్వారా దేశ ఆర్థిక, సామాజిక జీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో 24గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకవస్తే ఎవరూ నమ్మలేదని, ఎన్నోరకాలుగా మాట్లాడారని, కానీ, సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేసి చూపించారని చెప్పారు. ఈ రెండు పార్టీలతో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, వారితో అయ్యేది లేదు.. పోయేది లేదని ఎద్దేవా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ అవుతున్నాయన్నారు. మహిళ సమైక్య భవనాలకు ఇప్పుడైతే ఒక్కోదానికి 5లక్షలు ఇచ్చామని, రానున్న రోజుల్లో మరో 5లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులతో అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రసవ మరణాల నియంత్రణలో భాగంగానే తల్లీబిడ్డల రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రసవ మరణాలు సున్నాశాతానికి పడిపోయాయని, భావితరం ఆరోగ్యంగా ఎదుగుతున్నదన్నారు. బీడీ కార్మికులు, ఒంటరిమహిళలకు పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్క రూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మహిళ సంఘాల మహిళలు తదితరులు ఉన్నారు.