నగరంలో మరో 40 ఓపెన్ జిమ్ల ఏర్పాటు
అంబేద్కర్ స్టేడియాన్ని రూ. 16 కోట్లతో అభివృద్ధి చేస్తాం
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
వేసవి క్రీడా శిక్షణ ముగింపు కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు
కొత్తపల్లి, జూన్ 10: ప్రజారోగ్యమే ధ్యేయంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 30 రోజులుగా నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, అంతర్గత పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని, మరో 40 జిమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బల్దియా నిధులు సుమారు రూ. 40 లక్షలు వెచ్చించి క్రీడా శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 26 క్రీడాంశాల్లో 3122 మందికి క్రీడా శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ స్టేడియాన్ని రూ. 16 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. క్రీడలతో మానసికోల్లాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుపైనే దృష్టిసారించకుండా క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపేలా ప్రోత్సహించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ మాట్లాడుతూ, వేసవి క్రీడా శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్లో జరిగే క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలువాలని పిలుపునిచ్చారు. 30 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించిన నగరపాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడాశాఖను ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలపాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి కీర్తి రాజవీరు, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మాజీ అధ్యక్షుడు కడారి రవి, కబడ్డీ సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ సంపత్రావు, క్రీడా కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.