కరీంనగర్ విద్యానగర్, మార్చి 2 : కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న న్యూరో వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సులో న్యూరో సర్జరీలపై శనివారం పలువురు వైద్యులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కొత్తగా వస్తున్న మెళకువలపై నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ విజయసారథి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన స్పైనల్ కార్డ్ శస్త్రచికిత్సలో కోతలు లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఎలా చేయాలనే దానిపై ప్రజంటేషన్ చేశారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు హాజరు కాగా, కరీంనగర్కు చెందిన సీనియర్ వైద్యులు రమణారెడ్డి, పీవీకే కిశోర్, దాసరి శ్రీనివాస్, రంజిత్కుమార్, సంజయ్ సదస్సును పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి న్యూరో వైద్యుల సదస్సు కరీంనగర్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. సదస్సుకు 450 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు. న్యూరో విభాగంలో కొత్తగా వస్తున్న మెళకువలను నేర్చుకోవడానికి ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడుతాయి. అత్యాధునిక వైద్య పరికరాలతో రోగికి వందశాతం రికవరీ త్వరితగతిన అయ్యే మార్గాలను ఈ సదస్సులో వక్తలు చూపించారు.
– డాక్టర్ దాసరి శ్రీనివాస్, సీనియర్ న్యూరో ఫిజీషియన్
గతంలో క్యాన్సర్ ట్యూమర్స్ చికిత్స తీసుకోవాలంటే ఆరు వారాలు అవసరం ఉండేది. అలాంటిది ఇప్పుడు రేడియో సర్జరీ ద్వారా రెండు నుంచి ఐదు రోజులు మాత్రమే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. రోబోటిక్ సర్జరీ, ఎండోస్కోపీ, నావిగేషన్, అల్ట్రాసోనిక్, అస్టురేటివ్, లేజర్ ద్వారా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు మైక్రోస్కోప్, ఎండోస్కోపి సర్జరీలు కూడా అందుబాటులోకి రావడం శుభ పరిణామం. ప్రస్తుతం సర్జరీ అవసరం లేకుండానే రేడియేషన్తో చికిత్సలు చేయవచ్చు. దీంతో రోగి ఒక్కరోజులోనే డిశ్చార్జి అవుతున్నారు. స్పైన్ సర్జరీలు సైతం ఎండోస్కోపీ ద్వారా అందుబాటులోకి రావడంతో రోగుల రికవరీ శాతం ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ కార్డ్ స్టీమ్లెటర్ అందుబాటులోకి రావడంతో పక్షవాతానికి గురైన వ్యక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– డాక్టర్ మానస్ ఫణిగ్రహి, న్యూరో సర్జన్ (కిమ్స్ హాస్పిటల్)
రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కువ సేపు ప్రయాణాలు చేయడంతోనే చాలామందిలో వెన్నెముక సమస్యలు వస్తు న్నాయి. వీటితో పాటు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా కారణాలు అవుతున్నాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, దానికి తగ్గ ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి గురి కావడం కూడా ఒక కారణం. ఇలాంటి సమస్యలు ఎదురైతే సంబంధిత వైద్యుల వద్ద సలహాలు, సూచనలు తీసుకుంటే ప్రాథమిక దశలోనే నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే వెన్నెముకపై ఒత్తిడి పెరిగి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
– డాక్టర్ దాసరి వెంకటేశ్, న్యూరో ఫిజీషియన్
ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, పక్షవాతానికి గురైనప్పుడు బ్రెయిన్లో వచ్చే మార్పులకు గతంతో పోలిస్తే ప్రస్తుతం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రోగి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న చికిత్సల్లో సక్సెస్ రేటు 90 శాతంగా ఉంటున్నది. బ్రెయిన్ ట్యూమర్లను రోబోటిక్ శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా తక్కువ కోతలతో చేస్తుండడం తో రోగి త్వరగా కోలుకునే అవకాశముంటున్నది. వీటితోపాటు ఎండోస్కోపీ ద్వారా రేడియో సర్జరీతో చికిత్సలు అందుబాటులోకి రావడం శుభ పరిణామం.
– డాక్టర్ పీవీకే కిశోర్, సీనియర్ న్యూరో సర్జన్