కేసీఆర్ సర్కారు చేపట్టిన విద్యాసంస్కరణలతో డిగ్రీ విద్యకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కొలువుల సాధనకు దగ్గరి దారి కావడం, ప్రైవేట్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనిపిస్తున్నది. బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి రెగ్యులర్, బీబీఏ, డిగ్రీ ఆనర్స్ వంటి కాంబినేషన్ కోర్సులు చదివేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి విడుత ఆప్షన్కు ఈ నెల 30 వరకు గడువు ఉండగా ‘దోస్త్’లో పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
కరీంనగర్ కమాన్ చౌరస్తా, మే 24: విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో డిగ్రీ విద్యకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇంజినీరింగ్, మెడిసిన్ మోజులో పడి అటువైపు వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు సాధారణ గ్రాడ్యేయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెటింగ్ పోకడలకు అనుగుణంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని దాదాపు 80కి పైగా డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కాంబినేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఇష్ట పడుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ ఆన్లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ (దోస్త్) 2024 ద్వారా నమోదవుతున్న రిజిస్ట్రేషన్లు పరిశీలిస్తే ఈ విషయం తెలిసిపోతున్నది.
డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఇటు పోటీ పరీక్షలు, అటు పార్ట్టైమ్ జాబ్స్ చేసుకొనే అవకాశం ఉంటుంది. దీంతో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరుతున్నారు. కరీంనగర్కు చుట్టుపక్కల ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు నగరంలో డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నారు. చదువుకుంటూనే ఇక్కడ స్విగ్గీ, జోమాటో, ర్యాపిడో వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. పరిమిత కాలంతో హోటళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లల్లో పనిచేస్తున్నారు.
డిగ్రీలో ప్రవేశాల కోసం ప్రభుత్వం దోస్త్లో మే 6వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అందులో మూడు ఫేజుల్లో సీట్లను భర్తీ చేస్తుండగా, మొదటి విడుత రిజిస్ట్రేషన్లకు మే 29 ఆఖరు కాగా, వెబ్ ఆప్షన్లకు మే 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అందుకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో దోస్త్ హెల్లైన్ ఏర్పాటు చేశారు. అందులో కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ సూరపల్లి సుజాత ఉండగా, టెక్నికల్ అసిస్టెంట్లు మార్క సంతోష్, గొల్లె మారుతి, సపోర్టింగ్ స్టాఫ్గా ప్రవీణ్ కొనసాగుతున్నారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 80 కాలేజీల్లో రెగ్యులర్తోపాటు బీబీఏ, కంప్యూటర్స్, హోటల్ మేనేజ్మెంట్ లాంటి 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ సందేహాలు ఉంటే యూనివర్సిటీలోని దోస్త్ హెల్ప్ సెంటర్లో ఆఫీసు వేళల్లో సంప్రదించాలి.
– ప్రొఫెసర్ సూరపల్లి సుజాత, దోస్త్ ఎస్యూ కోఆర్డినేటర్