Collector Koya Sriharsha | పెద్దపల్లి, జూలై16: స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్లో 1,200 మంది శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. తొలి బ్యాచ్ సాధించిన విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభను, నైపుణ్యాలను పరిమితం చేసుకోకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ కొత్త అవకాశాలను అన్వేషించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), వీ హబ్తో అవసరమైన అనుసంధానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం నట్రాజ్, ఎల్డీఎం ప్రవీణ్ కుమార్, ఏపీ డీ రవీందర్, డీపీఎం రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించాలి
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా సాగు పనులు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ మేరక ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ నిర్వహించిన అంచనాల ప్రకారం 207 గ్రామాలు మోస్తరు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 15 వరకు 91,136 ఎకరాల్లో పంటల సాగు అంచనా వేయగా, ఇందులో 10,510 ఎకరాలు వర్షాధార పంటలు, 80,626 ఎకరాలు సాగునీటి ఆధారిత పంటలు ఉన్నాయని తెలిపారు. ఇంకా 1,84,671 ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఈనెలాఖరు వరకు 84,500 ఎకరాల్లో వరి, 1,814 ఎకరాల్లో కందులు, 1,182 ఎకరాల్లో పెసల్లు, 186 ఎకరాల్లో మినుములు, 136 ఎకరాల్లో అలసందలు, 16 ఎకరాల్లో ఉలవలు, 8 ఎకరాల్లో ఆముదం, 925 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో పశుగ్రాస జొన్న, 471 ఎకరాల్లో కూరగాయలు, 651 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.