సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఉమ్మడి జిల్లాకు మళ్లీ అన్యాయమే జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రం మరోసారి వివక్ష చూపింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట రైల్వేలైన్కు సంబంధించి ఊసే లేక పోగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్కు మళ్లీ అత్తెసరు నిధులే విదిల్చింది. అలాగే, రామగుండం -మణుగూరు లైన్కు కేవలం పది కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నది. వందేభారత్ రైలు ముచ్చట అసలే కనిపించలేదు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సౌకర్యాల మెరుగు కోసం అణా పైసా కేటాయించలేదు. ఇవి మచ్చుకు మాత్రమే కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే రైల్వే రంగానికి సంబంధించి కేంద్రం మొండిచెయ్యే చూపింది. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లూ బడాయిలు కొట్టిన బండి సంజయ్ కేంద్రం ముందు మరోసారి బోల్తాకొట్టగా, ఆయన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
– కరీంనగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఫిబ్రవరి4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 1న) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయమే జరిగింది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కనిపించింది. జాతీయ రహదారుల నుంచి మొదలు మెడికల్ కాలేజీ, నవోదయ, ట్రిపుల్ ఐటీ వంటి వాటి కేటాయింపుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతూనే ఉన్నది. కనీసం రైల్వే రంగానికి సంబంధించి అయినా న్యాయం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశించారు. కానీ, అవి సైతం ఆవిరయ్యాయి. రైల్వే రంగం కేటాయింపులకు సంబంధించి కేంద్రం శుక్రవారమే సమగ్రమైన నివేదికను విడుదల చేసింది. ఈ వివరాలను నిశితంగా పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచెయ్యి చూపింది. అత్యంత ప్రధానమైన కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వేలైన్ ఏర్పాటుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ గతంలో కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు డిటేల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డును కూడా ఆయన ఒప్పించారు. నిజానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకు ఇది అత్యంత ప్రాధాన్యత కల్గిన లైన్.
కాజీపేట జంక్షన్తో ఒకసారి లింకు ఏర్పడితే ఉమ్మడి జిల్లా వాసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి సౌకర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ వినోద్కుమార్ కేంద్రాన్ని ఒప్పించినా.. దానిని కంటిన్యూ చేసి నిధులు కేటాయింపు చేసుకోవడంలో బండి సంజయ్ ఎప్పుడు విఫలమవుతూనే ఉన్నారు. ఈ లైన్కు సంబంధించి తాజా, బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరినట్లు బండి ఇటీవల తెలిపారు. తీరా చూస్తే బడ్జెట్లో ఈ లైన్ ఊసే లేదు. కనీసం ‘చూస్తాం.. చేస్తాం’ అన్న ముచ్చట కూడా లేదు. ఇంత ప్రాధాన్యత గల లైన్ను కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బండి ఏం చెబుతారో చూడాలి.
మళ్లీ అత్తెసరు నిధులే..
కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్కు కేంద్రం మళ్లీ అత్తెసరు నిధులు మాత్రమే కేటాయించింది. 2021-22 బడ్జెట్లో 325 కోట్లు కేటాయించినా అందులో చాలా తక్కువ నిధులను మాత్రమే ఇచ్చింది. గతేడాది 160 కోట్లు ఇవ్వగా, ఈసారి 2023-24 బడ్జెట్లో 185 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోల్చిచూస్తే అదనంగా నిధులు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నా.. పట్టాల ప్రగతికి అవి ఏమాత్రం సరిపోవు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్పొడవు 151.34 కిలోమీటర్లు కాగా, అందులో మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీ, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన అరకొర నిధులతో 42.6 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది.
ఈసారి కనీసం 500 కోట్లు కేటాయిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు లైన్ పూర్తి చేయవచ్చని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం కేటాయించిన నిధులను పూర్తిగా ఇస్తే సిద్దిపేట వరకు పూర్తి చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన బడ్జెట్ కేటాయిస్తూ పోతే… మరో ఐదారేళ్లయినా కొత్తపల్లి- మనోహరాబాద్ లైన్ పూర్తికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ లైన్ పూర్తయితే రాష్ట్ర రాజధానితో అనుసంధానం ఏర్పడతుంది. అందుకే ఈ లైన్ కోసం సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. స్వయంగా ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేసినా.. అరకొర నిధుల కేటాయింపులే జరుగడం ఈ ప్రాంతంపై కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఆధునీకరణకు నిధుల్లేవు.. వందేభారత్ ముచ్చట లేదు
గ్రానైట్, మక్క ఎగుమతులు వంటి వాటితో దక్షిణ మధ్య రైల్వేకు కరీంనగర్ రైల్వేస్టేషన్ గత కొన్నేళ్లుగా అత్యధిక ఆదాయాన్నిస్తున్నది. దీని ఆధునీకరణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అంతేకాదు, సౌకర్యాల కల్పన కోసం ఇక్కడి వ్యాపార, వాణిజ్యవర్గాలు వినతులు చేస్తూనే ఉన్నాయి. కానీ, ఒక్కపైసా కేటాయించలేదు. అలాగే, వందేభారత్ రైలు సేవలు ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలోనే అందుతాయని బండి సంజయ్ ఇటీవల పేర్కొన్నారు. వందే భారత్కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు.
పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 100 కిలోమీటర్ల స్పీడ్, కరీంనగర్-జగిత్యాల(లింగంపేట) మధ్య 90 కి.మీ, జగిత్యాల-నిజామాబాద్ 100 కి.మీ, మేడ్చల్ -మనోహరాబాద్ 110 కిలోమీటర్ల స్పీడ్తో నడిపే విధంగా రైల్వేలైన్లను ఆధునీకరించినట్లుగా ప్రకటించారు. తీరా చూస్తే.. బడ్జెట్లో అందుకు సంబంధించిన ముచ్చటే లేదు. ఇక పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 209 కిలోమీటర్ల వేయాలని ప్రతిపాదించిన రామగుండం-మణుగూరు రైలు మార్గానికి 10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఎంపీగా వైఫల్యం?
కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కుమార్ ఉమ్మడి జిల్లాకు కేంద్రం నుంచి ప్రయోజనాలు చేకూర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రంగంలోనే కేంద్రం నుంచి వివక్ష కొనసాగుతున్నా.. వాటిని అడ్డుకునేందుకు ఏనాడూ ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అంతేకాదు, రావాల్సిన వాటి కోసం లేఖలు రాసింది, కృషి చేసిందీ లేదు. నిబంధనల ప్రకారం చూస్తే.. జిల్లాకో నవోదయ ఉండాలి. వాటిని సాధించడంపైనా దృష్టి పెట్టలేదు. కరీంనగర్ జిల్లాకు రావాల్సిన ట్రిపుల్ఐటీ వేరే రాష్ట్రం తన్నుకెళ్లినా దాని గురించి ఏనాడూ స్పందించలేదు.
ఆ తదుపరి మళ్లీ అందుకోసం అడిగిన పాపాన పోలేదు. కేంద్రం దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ఇస్తున్నా.. ఉమ్మడి జిల్లాకు సదరు కాలేజీలను మంజూరు చేయించడానికి ఆయన కనీస ప్రయత్నాలు చేయలేదు. జాతీయ రహదారుల విషయంలో పూర్తిగా వైఫల్యమే కనిపిస్తున్నది. గతంలో కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రహదారులకు కూడా నిధులు తెచ్చి పనిచేయించేందుకు ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. మెగా పవర్లూం క్లస్టర్ తేవడంలో ఆయన ఏనాడూ చొరవ చూపింది లేదు. ఎంపీగానే కాదు, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు అనేక రంగాల్లో కేంద్రాన్ని ఒప్పించి జిల్లాకు ప్రయోజనం చేకూర్చాల్సిన బండిపై అడుగడుగునా వైఫల్యం పొందుతున్నారే విమర్శలు వస్తున్నాయి.