మూడు రోజుల పసికందు కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. 24 గంటల్లోనే శిశువును తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. కిడ్నాప్ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 107 సీసీ ఫుటేజీలను వడపోసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పిల్లలు లేకపోవడంతో ఆర్ఎంపీ ఇచ్చిన సలహా మేరకు ఓ మహిళ పసికందును అపహరించిందని గుర్తించారు.
కరీంనగర్ రాంనగర్/ పాలకుర్తి , ఫిబ్రవరి 19: కరీంనగర్ టౌన్ ఏసీపీ ఆఫీసులో సోమవారం ఏసీపీ నరేందర్ వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నుంచి పాప అపహరణకు గురైందనే సమాచారం మేరకు పోలీసులు హాస్పిటల్కు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ నేతృత్వంలో నాలుగు టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దవాఖాన చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లినట్లు గుర్తించారు.
పాప తల్లికి సమీప బంధువైన 12 ఏండ్ల బాలుడు ఆ పసికందును ఎండకు ఉంచడం కోసం దవాఖాన బయట ఉండగా, అదే సమయంలో సదరు మహిళ పాపకు వ్యాక్సిన్ చేయిస్తానంటూ బలవంతంగా చేతుల్లోంచి తీసుకెళ్లింది. అడిగినా ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నది. మంచిర్యాల చౌరస్తా దాకా నడుచుకుంటూ వెళ్లి ఆటో ఎక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా, నాకా చౌరస్తా వద్ద దిగి బస్సు ఎక్కిందని చెప్పాడు. వెంటనే బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా జమ్మికుంటకు బస్సులో వెళ్లింది. వెంటనే అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
వారు జమ్మికుంట బస్టాండ్లో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితురాలు పట్టణానికి చెందిన ముకెర కవిత అలియాస్ పద్మగా నిర్ధారించుకున్నారు. విచారణ జరపగా ప్రస్తుతం ఆమె పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతకళ్లపల్లిలో ఉంటున్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అక్కడకు వెళ్లి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పాపను తీసుకొని వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలించి వైద్యులకు అప్పగించగా, తర్వాత వారు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
కాగా, కవితను విచారించగా, పెళ్లయి చాలాకాలంగా పిల్లలు లేకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ ఎర్రమరాజు జగ్గం రాజును సంప్రదించగా, ఆయన సలహా మేరకు పాపను కిడ్నాప్ చేశానని అంగీకరించింది. దాంతో ఆర్ఎంపీ రాజును కూడా అదుపులోకి తీసుకొని నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తామని ఏపీపీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన టూటౌన్ ఇన్స్పెక్టర్ బృందంతోపాటు టాస్ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ జమ్మికుంట పోలీసులను అభినందించారు. మొత్తం వందకు పైగా సీసీ కెమెరాలు పరిశీలించి ఛేదించారని చెప్పారు. ఇక్కడ సీఐలు వెంకటేశ్ సృజన్రెడ్డి, రవికుమార్, ఎస్ఐ కిరణ్రెడ్డి ఉన్నారు.